
వరిపైరులో పురుగుల పని పట్టండిలా
కై కలూరు: వరి పైరు చిరు పొట్ట దశలో ఉంది. ఈ దశలో వరిపైరుపై పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ఏలూరు జిల్లాలో 2,45,855 సాదారణ వరి విస్తీర్ణానికి గానూ 2,00,490 ఎకరాల్లో నాట్లు వేశారు. మొత్తం రైతులు 1,36,468 రైతులు ఉండగా, వీరిలో 32,074 మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రస్తుత తరుణంలో పురుగుల వ్యాప్తిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కై కలూరు మండల వ్యవసాయాధికారిణి ఆర్.దివ్య సూచనలు చేశారు.
కాండం తొలుచు పురుగు
నారుమడి దశ నుంచి ఈనిక దశ వరకు వరి పైరును కాండం తొలుచు పురుగు నష్టపరుస్తుంది. దీనినే మొవ్వు పురుగు, పీక పురుగు, తెల్లకంకి అంటారు. ఖరీఫ్లో తక్కువ నుంచి మధ్యస్తంగా, రబీలో మధ్యస్తం నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. నారుమడిలో అశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకి ఏర్పడుతుంది గుడ్డు నుంచి వచ్చిన లార్వా కాండము కింద వైపు నుంచి లోపలికి ప్రవేశించి మొవ్వను తినేస్తోంది.
నివారణ చర్యలు..
నారు పీకటానికి వారం రోజులు ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3జీ గుళికలను పలుచగా చల్లి మడిలోనే ఇంకేటట్లు చేయాలి. పిలక, దుబ్బు చేసే దశలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి 10 కిలోలు వేయాలి. ఎసిఫేట్ 75 ఎస్.పి.1.5 10 కిలోలు వేయాలి లేదా ఎసిఫేట్ 75 ఎస్పీ1.5 గ్రా, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అంకురం నుంచి చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 శాతం గుళికలు 4 కిలోలు వేయాలి.
ఆకుముడత
పంట నాటిన దగ్గర నుంచి పోటాకు దశ వరకు ఆకుముడత ఆశిస్తుంది. దీనినే నాము, తెల్ల తెగులు అంటారు. ఇది సీతాకోక చిలుకలగా ముదురు గోధుమ రంగులో ఉండి రెక్కల అంచుల మధ్య సన్నని నల్ల గీతలుంటాయి. పొలంలో నడస్తూ ఉంటే గుంపులు గుంపులుగా ఎగిరే రెక్కల పురుగులను బట్టి అకుముడతను గుర్తించవచ్చు. ఆలస్యంగా నాటిన పొలాల్లో, వర్షభావ పరిస్థితులలోను, చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం, నత్రజని ఎరువు అధిక మోతాదులో వాడటం వల్ల దీని ఉదృతి పెరుగుతుంది. పొటాకు దశలో దుబ్బుకి 1 నుంచి 2 కొత్తగా తెల్లగా గీకబడిన ఆకులు, వాటిలో చిన్న లార్వాలు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి.
నివారణ చర్యలు
పరాన్నజీవులైన ట్రైకోగ్రామా ఖిలోనిస్ను ఎకరాకు 20,000 చొప్పున మూడు సార్లు వదలాలి. పిలక దశలో చేనుకు అడ్డంగా తాడును 2–3 సార్లు లాగితే పురుగులు పడిపోతాయి. నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, లేదా ఎసిఫేట్ 1.5 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొట్ట ఆకు దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రా, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్పీ 0.4 మిల్లీ గ్రాములు, లేదా ఫ్లూబెండామైడ్ 20 డబ్యూడీజీ 0.25 గ్రా, లేదా ప్లూబెండమైడ్ 48 ఎస్పీ 0.1 మి.లీ, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ 8 కిలోల లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 శాతం 4 కిలోలు గుళికలు ఎకరాకు చొప్పున వేయాలి.
సుడిదోమ
నారుమడి, పిలక, పొట్ట, ఈనిక దశల్లో దోమలు నీటి మట్టంపై ఉంటూ దుబ్బుల నుంచి రసం పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగిస్తాయి. వీటిలో దోమపోటు, గోధుమ వర్ణపు దోమ, తెల్ల మచ్చ దోమలు కీలకమైనవి. వీటి ఉదృతి ఎక్కువైతే పొలం ఎండి పడిపోవటం, తాలు గింజలు, నూర్చినప్పుడు నూక అవుతుంది. తొలి దశలో రసాన్ని పీల్చడం వల్ల పైరు లేత పసువు వర్ణానికి మారుతుంది. ఉదృతి పెరిగే కొద్ది పైరు సుడులు సుడులుగా వలయకారంలో ఎండిపోతూ ఉంటాయి. నత్రజనిని అధిక మోతాదు, కాలి బాటలు తీయని పొలాల్లో, పైరు తొలిదశలో ఆకులను ఆశించే పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్, ప్రొఫెనోఫాస్, సింథటిక్ పైరథ్రాయిడ్ మందులను వాడినపుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువవుతోంది.
నివారణ చర్యలు
పిలకల దశలో దుబ్బుకు 10 దోమలు, ఈనిక దశలో దుబ్బుకు 20–25 దోమలు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. వరి నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీ మీటర్ల బాటలు తీయాలి. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా,లేదా మోనోక్రోటోఫాస్ 2.2 మి.లీ లేదా ఇథోఫెనోప్రాక్స్ 2 మి.లీ, లేదా ఫెనోబుకార్బ్ 2 మి.లీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ, లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రా, లేదా బుప్రోఫెజిన్ 1.6 మి.లీ, లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రా, లేదా ట్రైవ్లూమిజోఫైరిమ్ 0.486 మి.లీ, పిచికారీ చేయాలి.
కై కలూరు మండల
వ్యవసాయాధికారిణి ఆర్.దివ్య
చిరు పొట్ట దశలో వరిపైరుకు పురుగుల బెడద

వరిపైరులో పురుగుల పని పట్టండిలా

వరిపైరులో పురుగుల పని పట్టండిలా

వరిపైరులో పురుగుల పని పట్టండిలా

వరిపైరులో పురుగుల పని పట్టండిలా

వరిపైరులో పురుగుల పని పట్టండిలా