
సీఐపై చర్యలు తీసుకోవాలని వినతి
రేణిగుంట: శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ గోపి తమ పట్ల అమానుషంగా వ్యవహరించారని, ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణంలోని పూసల వీధి వాసులు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తికి ఫిర్యాదు చేశారు. వివరాలు.. శ్రీకాళహస్తి పట్టణం, 18వ వార్డు, పూసల వీధిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త షేక్ ఖాదర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి కేక్ కత్తిరించి స్నేహితులతో కలసి ఎలాంటి ఆర్భాటం లేకుండా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. అయితే సీఐ గోపి సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని, కేక్ కటింగ్కి అనుమతులు లేవని చెప్పి అక్కడున్న యువకులను పంపించేశారు. జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న షేక్ ఖాదర్ వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తి అని టీడీపీ నాయకులు చెప్పడంతో మళ్లీ పూసల వీధికి చేరుకుని తమపై సీఐ జులుం ప్రదర్శించారని బాధితులు ఆరోపించారు. అక్కడ ఉన్న షేక్ ఖాదర్, అతని స్నేహితులను విచక్షణరహితంగా కొట్టి, నానా దుర్భాషలాడారన్నారు. గంజాయి కేసులు పెట్టి జైల్లో వేస్తానని హెచ్చరించారన్నారు. బీడీ పని చేసుకునే మీకెందుకు ఇలాంటివంటూ అవహేళనగా మాట్లాడినట్టు వాపోయారు. ఈ మేరకు విచారిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చినట్టు బాధితులు తెలిపారు.