
ఐదు రోజుల్లో ఐదు హత్యలు
గంజాయి, మద్యం మత్తే కారణాలు
ఐదు రోజుల్లో ఐదు హత్యలు
పచ్చని భూములు. గలగల పారే కాలువలు. పాడి పంటలతో అలరారే చారిత్రత్మాక సింహపురి.. కొత్తగా రక్త చరిత్రను లిఖిస్తోంది. గడిచిన ఏడాది కాలంగా నెల్లూరులో జరిగిన మారణహోమాలు ఇందుకు దర్పణం. శాంతి భద్రతలను పరి రక్షించాల్సిన పోలీసులు తమ విధులను గాలికి వదిలేశారు.
సాక్షిప్రతినిధి నెల్లూరు: జిల్లాలో పోలీసు వ్యవస్థ చేవ కోల్పోయింది. జిల్లాలో పనిచేసిన కొందరు పోలీస్ బాస్ల హయాంలో పోలీస్ వ్యవస్థ అత్యంత శక్తి వంతంగా ఉండేది. అప్పట్లో నేరాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంలో నలిపేశారు. నేరాలకు పాల్పడాలంటే భయపడి జిల్లానే వదిలేసి వెళ్లిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఖాకీలు ఇప్పుడు పచ్చపార్టీ నేతలకు ఊడిగం చేస్తుండడంతో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ నెలలో ఐదు రోజుల వ్యవధిలో ఐదు హత్యలు జరిగాయంటే పరిస్థితి తీవ్రత ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. శాంతిభద్రతలు లోపించడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గస్తీకి సుస్తీ.. నేరస్తులకు హ్యాపీ
జిల్లాలో ఐదు సబ్డివిజన్లు, 12 సర్కిల్స్ పరిధిలో 52 పోలీసుస్టేషన్లు, 11 అర్బన్ పోలీసుస్టేషన్లు ఉన్నా యి. వాటి పరిధిలో కొద్ది కాలంగా పోలీసు గస్తీ అంతంత మాత్రంగానే మారడంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. పాతనేరస్తులు, అసాంఘిక శక్తుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పాత కక్షల నేపథ్యంలో ఒకరు.. కుటుంబ కలహాల నేపధ్యంలో ఇంకొకరు.. ఇతరత్రా కారణాలతో మరొకరు ప్రత్యేర్థులను హత్యచేస్తున్నారు. మానవత్వం, బంధుత్వం, కుటుంబ భవబంధాలు చూడకుండా అడ్డొచ్చిన వారి ని అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. పగలు, ప్రతీకారాలతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. జిల్లా లో కిరాయి సంస్కృతి పెరుగుతోంది. సుఫారి తీసుకు ని ప్రత్యర్థులను అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. ఇతర జిల్లాలోనూ నేరాలకు పాల్పడుతున్నారు.
మత్తులోనే విశృంఖలంగా నేరాలు
జిల్లాలో మద్యం ఎరులై పారుతోంది. గంజాయి విక్రయాలు చాపకింద నీరులా సాగుతోన్నాయి. మత్తు, మాదక ద్రవ్యాలకు బానిసైన యువత విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. వ్యసనాలను తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఒంటరిగా వెళ్లేవారిని కత్తులతో బెదిరరించి అందినకాడికి దోచుకోవడం, ఎదురు తిరిగిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ పరిణామాలతో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నెల్లూరు నగరంలో పరిస్థితి మరింత ఆందోళన కరంగా మారుతోంది. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నారు. పది నెలల వ్యవధిలో సుమారు 18కు పైగా హత్యలు జరిగాయంటే శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగత మవుతోంది.
అక్టోబర్ 3వ తేదీ
విడవలూరు మండలం ముదివర్తిలో జరిగింది. గ్రామ బీసీ కాలనీకి చెందిన తాండ్ర రవికుమార్ మద్యం తాగొచ్చి భార్య సుప్రజతో నిత్యం గొడవలు పడుతూ ఉండడంతో కొడుకు ప్రేమ్చంద్ తన తల్లి సుప్రజకు అండగా ఉంటూ తండ్రిని మందలిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కుమారుడు ప్రేమ్చంద్ ఇంట్లో పడుకొని నిద్ర పోతున్న సమయంలో రవికుమార్ ఇంటికి వచ్చి నిద్రపోతున్న కొడుకు ప్రేమ్చంద్పై రోకలి బండతో కొట్టి హత్య చేశాడు.
లింగసముద్రం మండల పరిధిలోని రాళ్లపాడు ప్రాజెక్ట్లో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి శవాన్ని ప్రాజెక్ట్లో పడేశారు. అతను ఎవరనే విషయం కూడా పోలీసులకు ఆధారాలు సేకరించలేకపోయారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో అతన్ని హత్య చేశారనేది స్పష్టం.
ఏడాది కాలంలో జిల్లాలో ఘటనలు మచ్చుకు కొన్ని..
నెల్లూరు ప్రగతినగర్లో గంజాయి, మద్యం మత్తులో కొందరు యువకులు కారు డ్రైవర్ను అతి కిరాతకంగా హత్య చేశారు.
ముత్తుకూరు బస్టాండ్ వద్ద గంజాయి మత్తులో ఇద్దరు యువకులు ఓ మహిళను చంపుతామని బెదిరించి రెండు సెల్ఫోన్లను దోచుకెళ్లారు.
తల్పగిరికాలనీ వద్ద నాగేంద్రను కత్తులతో చంపుతామని బెదిరించి అతని ఫోన్పే నుంచి రూ.5 వేల నగదును దుండగులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
టిఫిన్ విషయంలో మాటామాటా పెరిగి టెంపో ట్రావెల్స్ నిర్వాహకుడు అల్లాభక్షును మత్తులో ఉన్న రంగనాయకులపేటకు చెందిన షేక్ ఇషాక్ హత్య చేశాడు.
మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో సుల్తాన్ అనే వ్యక్తిని ఇద్దరు హత్య చేశారు.
గంజాయి మత్తులో ఉన్న కొందరు నెల్లూరు సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.
మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రైల్వేస్టేషన్ వద్ద బైక్పై వెళుతున్న బ్యాంకు ఉద్యోగిని చంపుతామని కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నారు.
ఇటీవల నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్లో ఓ యువకుడు హోటల్ కెళ్లి టిఫన్ ఆర్డర్ ఇచ్చాడు. తనకంటే వెనకున్న ఓ వ్యక్తి ఆర్డర్ ఇచ్చారు. ముందుగా తాను టిఫిన్ ఆర్డర్ ఇచ్చినా వెనకొచ్చిన వ్యక్తికి ఇచ్చాడని కారణంతో ఇద్దరు మధ్య జరిగిన చిన్న వివాదంతో దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.
నెల్లూరు రామలింగాపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో రౌడీషీటర్ కత్తి రవి (32)ని దారుణంగా హత్య చేసిన నిందితులు.
ఆర్థిక విభేదాల నేపథ్యంలో ముత్యాలపాళెంలో ఎం.పౌల్ (35)ను దారుణంగా హత్య చేసిన నిందితులు.
కొండాపురం మండలంలో తిరుపాల్ (55) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి 25 మేకలను అపహరించుకెళ్లారు.
ఉదయగిరిలో జనం చూస్తుండగానే వరుసకు బావను బావమరుదులే హత్య చేశారు. ఆస్తి తగాదాలే కారణం.
కలువాయి మండలంలోని పల్లంకొండలో గోపి అనే యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు.
కొడవలూరు మండలం టపాతోపు వద్ద హిజ్రా నాయకురాలు హాసినీని ప్రత్యర్థులు దారుణంగా చంపారు
కొడవలూరు మండలం మిక్కిలింపేట వద్ద బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన స్టీల్వ్యాపారి రమేష్ హత్యకు గురైయ్యాడు.
నెల్లూరు ఉడ్హౌస్ సంఘంలో సస్పెక్ట్ షీటర్ కళ్యాణ్ను పాతకక్షల నేపథ్యంలో హత్య చేసిన దుండగులు.
ఇందిరాగాంధీనగర్లో రౌడీషీటర్ సుజనకృష్ణ అలియాస్ చింటూను స్నేహితులే కిరాతకంగా హత్య చేశారు.
తాజాగా జాకీర్ హుస్సేన్నగర్ న్యూకాలనీలో మద్యం మత్తులో దూషించాడని భర్త శ్రీనివాసకుమార్ను హత్య చేసిన భార్య.

అదుపు తప్పిన శాంతిభద్రతలు