
జూరాలకు 1.15లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● 10 గేట్లు ఎత్తి 1.12 లక్షల క్యూసెక్కులు నీరు దిగువకు..
● 12 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
గద్వాల/ఆత్మకూర్: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. సోమవారం జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 10 గేట్లు ఎత్తి 1.12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జల విద్యుదుత్పత్తి ద్వారా 38,651 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.336 టీఎంసీలు నిల్వ ఉంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులైన నెట్టెంపాడు, భీమా లిఫ్ట్– 1, 2, కోయిల్సాగర్, ఆర్డీఎస్, సమాంతర కాల్వలకు నీటిని పూర్తిగా నిలిపివేశారు. జూరాల ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
12 యూనిట్లలో విద్యుతుత్పత్తి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టినట్లు జెన్కో ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తం 749.276 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.
శ్రీశైలం ఆనకట్ట వద్ద ఒక్క గేటు ఎత్తివేత
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం కొంత మేర పెరగడంతో సోమవారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఒక్క గేటును పైకెత్తి నీటిని దిగువున సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల ఆనకట్ట స్పిల్వే ద్వారా 71,820 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 38,651 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,892 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు కలిపి మొత్తం 1.196 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయం చేరుతోంది. దీంతో శ్రీశైలం ఆనకట్ట ఒక్క గేటు పది అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వార 28,075 క్యూసెక్కుల వరద సాగర్కు విడుదల చేస్తున్నారు. భూగర్భ కేంద్రంలో 17.127 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 15.082 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 27,330 క్యూసెక్కులు మొత్తం 62,645 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్దాయి నీటిమట్టం 885.0 అడుగులు, 215.8070 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేల, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,830 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.