
క్వార్టర్ల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
● కర్నూలు కలెక్టర్ను ఆదేశించిన లోకాయుక్త
కర్నూలు(సెంట్రల్): కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన ఏ, బీ, సీ క్వార్టర్లను దుర్వినియోగం చేస్తున్న అనధికార వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను లోకా యుక్త ఆదేశించింది. ప్రభుత్వ క్వార్టర్లు దుర్వినియోగమవుతున్నాయని జగన్ అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. నిర్దేశిత ఫార్మాట్లో ఫిర్యాదు లేకున్నా.. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన విషయం కావడంతో విచారణకు స్వీకరించినట్లు లోకాయుక్త తెలిపింది. ఏ, బీ, సీ క్యాంపుల్లోని క్వార్టర్ల ప్రస్తుత స్థితిగతిని తెలుసుకునేందుకు వెంటనే సర్వేను నిర్వహించాలని కలెక్టర్ను ఆదేశించింది. ప్రతి ఇంటిని సర్వే చేసి ఆక్రమణకు గురైనా, వ్యాపార సంస్థలకు లీజు ఇచ్చినా, అనధికార వ్యక్తులు ఉన్నా గుర్తించి పూర్తి వివరాలను రికార్డులో డీఆర్వోతో నమోదు చేయించాలని ఆదేశించింది. అనధికార వ్యక్తులు, సబ్లీజుకు ఇచ్చిన సందర్భాలు ఉంటే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ ఆదేశించారు.
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైఎస్సార్ కడప క్రీడా పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సారానికి 4, 5 తరగతుల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాల్గవలో ప్రవేశానికి 2015 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31, ఐదవ తరగతిలో ప్రవేశానికి 2014 ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చి 31 మధ్య జన్మించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న వారు అర్హులన్నారు. ఈనెల 19లోగా https:// apsportsschool.ap.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 1 నుంచి 3వ తేదీ వరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే శారీరకదారుఢ్య పరీక్షలకు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంపికై న విద్యార్థులు అదే నెల 10, 11వ తేదీల్లో ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరవుతారన్నారు. మరింత సమాచారం కోసం 8712622576 నంబరును సంప్రదించాలన్నారు.
ఇసుక మాయం
సి.బెళగల్: మండల కేంద్రంలోని రెవెన్యూ ఆధ్వర్యంలో ఉన్న ఇసుక మాయమైంది. మండల పరిధిలోని తుంగభద్ర నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయ ఆవణంలో ఇసుకను నిల్వ చేశారు. కాగా మండల రెవెన్యూ అధికారుల నిఘా లేకపోవడంతో ఇసుకను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. ఒకపక్క తహసీల్దార్ కార్యాలయం.. మరో పక్క పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ సీజ్ చేసిన ఇసుక మాయమవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ఇన్చార్జ్ తహసీల్దార్ పురుషోత్తంను వివరణ కోరగా విచారిస్తానని సమాధానం ఇచ్చారు. ఎస్ఐ పరమేష్నాయక్ దృష్టికి తీసుకెళ్లగా తాము కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించామని, ఇసుక మాయంపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే విచారిస్తామని చెప్పారు.