
వక్ఫ్ చట్ట సవరణను ఉపసంహరించుకోండి
కర్నూలు(సెంట్రల్): వక్ఫ్ చట్ట సవరణను ఉపసంహరించుకోకుంటే ముస్లిం మహిళలే ముందుండి ఉద్యమాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉన్నారని ముస్లిం పర్సనల్ లాబోర్డు రాష్ట్ర కమిటీ సభ్యులు జలీసా సుల్తానాయాసీన్, అఖిల భారత ప్రజాతంత్రమహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల, జమాతే ఇస్లామియా ఏ హింధ్ సభ్యులు కుద్దుసా, నాసిర ఖానం కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం నగరంలోని మెరిడియన్ ఫంక్షన్ హాలులో సేవ్ వక్ఫ్..సేవ్ రాజ్యాంగం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తాహేరున్సీ, పర్వీల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం వక్ఫ్ భూములను బడా బాబులకు కట్టబెట్టేందుకే చట్ట సరవణ చేసిందని విమర్శించారు. ఎంపీల సంఖ్యా బలం ఉందని ముస్లింల ఆత్మగౌరవాన్ని కించ పరిచేలా వక్ఫ్ చట్ట సవరణ చేయడం తగదన్నారు. ముస్లింల ఆస్తులను కాజేసేందుకు ఆర్ఎస్ఎస్ కుట్రలో బీజేపీ పాలు పంచుకుందన్నారు. తమ వక్ఫ్ ఆస్తుల్లో ముస్లింమేతరుల పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. నతరం మెరిడియన్ ఫంక్షన్ హాలు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం ఎదుట కాసేపు నిరసన చేపట్టి కలెక్టర్ పి.రంజిత్బాషాకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు, నాయకురాళ్లు అరుణ, జయమ్మ, పుష్పావతి, పద్మావతి పాల్గొన్నారు.