
టిప్పర్ను ఢీకొని పాస్టర్ ప్రేమ్ రాజ్ దుర్మరణం
ఘంటసాల: మండలం లోని లంకపల్లి జాతీయ రహదారిపై టిప్పర్ను ఢీకొని మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో పాస్టర్గా పని చేస్తున్న కె.సుబ్బారావు (ప్రేమ్ రాజ్)(41) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, సేకరించిన వివరాల మేరకు ఆదివారం రాత్రి చల్లపల్లి వైపు నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ మరమ్మతులకు గురి కావడంతో లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై నిలిపివేశారు. పాస్టర్ ప్రేమ్రాజ్ తన స్వగ్రామమైన బాపట్ల జిల్లా మోర్తోట గ్రామంలోని చర్చిలో ఆదివారం రాత్రి ప్రార్థన ముగించుకుని బుద్దాలపాలెంకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. లంకపల్లి గ్రామం వద్ద చీకట్లో ఉన్న టిప్పర్ను గమనించిక వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రేమ్రాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక ఉన్న భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారు ముగ్గురిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ప్రేమ్రాజ్ మృతి చెందినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న ఘంటసాల ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దివిసీమ పరిసర ప్రాంతాల పాస్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రేమ్ రాజ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం బుద్దాలపాలెంలో పాస్టర్ ప్రేమ్రాజ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
పెడన: పెడన–గుడివాడ జాతీయ రహదారిలో ఉన్న పల్లోటి ఇంగ్లిష్ మీడియం హైస్కూలు వద్ద సోమవారం రాత్రి ద్విచక్ర వాహనదారుడు విద్యార్థుల సైకిళ్లను ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు, ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల మేరకు పట్టణానికి చెందిన జల్లూరి గిరిష్, గుత్తి లోహిత్, షేక్ మతీన్, మహమ్మద్ ముదాసిర్ పదో తరగతి చదువుతున్నారు. స్పెషల్ క్లాసులు అనంతరం రాత్రి 8 గంటల సమయంలో నలుగురు నాలుగు సైకిళ్లపై పెడన వైపుగా బయల్దేరారు. పల్లోటి కాలనీ నుంచి ద్విచక్రవాహనంపై యార్లగడ్డ వీరబాబు మద్యం తాగి లైటు లేని ద్విచక్ర వాహనంపై వస్తూ వీరిని ఢీకొట్టి కింద పడిపోయాడు. గిరిష్ కాలికి తీవ్ర గాయం కాగా మిగిలిన ముగ్గురు విద్యార్థులకు కూడా కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. వీరబాబుకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్కూలు ఉపాధ్యాయు లు పెడనలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. పెడన పోలీసులు వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
ఎస్ఎఫ్ఐ డిమాండ్
మచిలీపట్నంఅర్బన్: దసరా సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.సమరం డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమంలో ఈమేరకు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమరం మాట్లాడుతూ ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాల సందర్భంగా అధికారికంగా సెలవులు ప్రకటించిందని, అయితే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు బషీమ్, మండల కార్యదర్శి ప్రదీప్, జైకర్ తదితరులు పాల్గొన్నారు.

టిప్పర్ను ఢీకొని పాస్టర్ ప్రేమ్ రాజ్ దుర్మరణం