
ప్రాధాన్యత ప్రకారం ఫిర్యాదుల పరిష్కారం
ఇందిరమ్మ ఇళ్లకు సమృద్ధిగా ఇసుక
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు అందించే ఫిర్యాదులను ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ ఏ దరఖాస్తూ పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’
ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో చదివే నైపుణ్యాలు పెంచేలా ఉపాధ్యాయులు పాటుపడాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరెట్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమంపై సమీక్షించిన ఆయన చింతకాని మండలంలో ఎంపిక చేసిన ఐదు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ద్వారా కార్యక్రమం అమలుచేయాలని తెలిపారు. ఇవికాక జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3నుంచి 4గంటల వరకు ఒక పీరియడ్ను సోమవారం నుంచే కేటాయించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మోడల్గా జిల్లా
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో మోడల్గా నిలపాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బోనకల్ మండలంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల పనులపై సోమవారం ఆయన టీజీఈడబ్ల్యూఐడీసీ సీఈ షఫీమియాతో సమీక్షించారు. స్కూల్ భవనంతో పాటే రోడ్లు, తాగునీటి వసతి, పార్కింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తిచేయాలని తెలిపారు. పీఆర్ ఎస్ఈ జి.వెంకటరెడ్డి, సీపీఓ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు సరిపడా ఇసుక లభ్యమయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇసుక లభ్యతపై కలెక్టర్ సోమవారం అధికారులతో సమీక్షించారు. స్థానిక వనరుల నుంచి ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని, ఇళ్ల పేరిట ఇసుక పక్కదారి పట్టకుండా నిఘా వేయాలని సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.