
కళామేళా కనువిందు
బనశంకరి: సిలికాన్ సిటీలో జేపీ నగరలో నిర్వహిస్తున్న రాజస్థానీ హస్తకళా, చేనేత మేళా మహిళలను ఆకట్టుకుంటోంది. 7వ ఫేజ్ ఆర్బీఐ లేఔట్ సోమేశ్వర సభాభవన్లో మేళా జరుగుతోంది. దేశంలో పేరుమోసిన ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు, చీరలు, నూలు, పట్టుచీరలు ఇక్కడి స్టాళ్లలో విక్రయిస్తున్నారు. అలాగే గృహాలంకరణకు సారంగపుర కళా సామగ్రి, తివాచీలు, మార్బుల్ క్రాఫ్ట్స్, కంచు, దంత కళాసామగ్రి, పెయింటింగ్స్, హ్యాండ్బ్యాగులు, జ్యువెలరీ, పింగాణీ వస్తువులు లభిస్తున్నాయి. 22వ తేదీ వరకు నిర్వహిస్తారు.
లాల్బాగ్ను
చంపేయొద్దు: అశోక్
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి నగరం గుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన సొరంగ మార్గం పథకాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ డిమాండు చేశారు. ప్రమాదంలో లాల్బాగ్ అనే పేరుతో ఎక్స్లో పోస్ట్ చేశారు. సొరంగ మార్గం ప్రాజెక్టు కోసం బెంగళూరు శ్వాసకోశంగా ఉన్న లాల్బాగ్ పార్క్ను బలి ఇస్తున్నారన్నారు. లాల్బాగ్లోని 6 ఎకరాలు పోతుందని, వేలాది చెట్లను నరికివేస్తారన్నారు. పరిసరవాదులు,మేధావులు ఇప్పటికే ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారన్నారు. ఒక వ్యక్తి ప్రచారం కోసం ఇంత విధ్వంసం అవసరమా అని డీసీఎం డీకే శివకుమార్పై మండిపడ్డారు. పార్కు రక్షణకు ప్రజలతో కలిసి పోరాడుతామన్నారు.
కుర్చీ వివాదాన్ని తీర్చాలి: హోంమంత్రి
శివాజీనగర: సీఎం పీఠం పంపిణీ వివాదాన్ని పార్టీ హై కమాండ్ పరిష్కరించాలని హోం మంత్రి జీ.పరమేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం బెంగళూరులో సదాశివనగర ఇంటి వద్ద మాట్లాడిన ఆయన, పవర్ షేరింగ్ వివాదాన్ని పరిష్కరించాలని మంత్రి సతీశ్ జార్కిహొళి చెప్పడాన్ని సమర్థించారు. దీనిపై గందరగోళం ఉంది, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రకటనలు చేస్తున్నారు. దీనిని హైకమాండ్ గమనిస్తోంది. బిహార్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో మార్పులు అంటూ ఏమీ చెప్పలేం. హైకమాండ్ మార్చాలంటే మారుస్తుంది, బెంగళూరులో, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని సరిజేయడం తమ బాధ్యత అన్నారు. కాగా, సుప్రీంకోర్టులో దళితుడు, సీజే జస్టిస్ గవాయ్పై దాడి జరిగింది, అది రాజ్యాంగానికి చేసిన అవమానం. అక్కడి భద్రతా వ్యవస్థ విఫలమైంది. దాడికి పాల్పడిన న్యాయవాదిని ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు.
గజిబిజిగా కులగణన
● విజయేంద్ర
దొడ్డబళ్లాపురం: బీసీలకు న్యాయం చేసేది బీజేపీ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. మంగళవారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే ఆ సర్వేలు శాసీ్త్రయంగా, న్యాయంగా జరగాలన్నారు. సర్వేలో జరుగుతున్న తప్పులను, గందరగోళాలను దిద్దుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంటే, సర్వేలకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అనేక చోట్ల సర్వే సిబ్బందిపై దౌర్జన్యాలు, కుక్కల దాడులు జరుగుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి, అలాంటి జరగకుండా చూడాలని సర్కారుని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబాన్ని 60 ప్రశ్నలు అడగడం ఎంతవరకూ సమంజసమన్నారు. సీఎం, డీసీఎం కూడా ఈ విషయంలో విస్మయం వ్యక్తం చేశారన్నారు.
టెన్త్ విద్యార్థుల ఫీజుల పెంపు
దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) విద్యార్థులపై భారం మోపనుంది. వార్షిక పరీక్షల ఫీజును 5 శాతం పెంచింది. ఈ మేరకు కర్ణాటక పాఠశాలలు, వాల్యూయేషన్ బోర్డు ఉత్తర్వులను జారీచేసింది. ఇప్పుడు మొదటిసారి పరీక్షలు రాసే విద్యార్థి రూ.676 కు బదులుగా రూ.710 చెల్లించాలి. కొత్తగా నమోదు చేసుకునే ప్రైవేటు విద్యార్థులకు నమోదు మరియు అప్లికేషన్ రుసుము రూ.236 నుంచి 248కి పెంచారు. సబ్జెక్ట్ రాసే విద్యార్థులు రూ.427 కు బదులు రూ.448 చెల్లించాలి. రెండు అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్లు రాసే విద్యార్థులు రూ.532 కు బదులు రూ.559 చెల్లించాలి. సమాధానపత్రాల మదింపు, ఇతర పాలనాపరమైన ఖర్చులు పెరిగినందున ఫీజులను పెంచినట్లు బోర్డు సమర్థించుకుంది.