
సిబిల్ స్కోర్ వివరాలు అందించాలి
కరీంనగర్ కార్పొరేషన్: రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ వివరాలు బ్యాంక్లు వెంటనే అందించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. సోమవారం నగరపాలకసంస్థలో బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారుల బ్యాంకు బ్రాంచ్ల వివరాల ప్రకారం ఇప్పటికే సిబిల్ స్కోర్ కోసం దరఖాస్తులు పంపించామన్నారు. సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తిచేసిన బ్యాంకులు, సంబంధిత సిబిల్ స్కోర్ వివరాలను తిరిగి తమకు అప్పగించాలన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం బ్యాంకులకు లేదన్నారు. ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, మెప్మా పీడీ వేణుమాధవ్రెడ్డి, టీఎంసీ మానస పాల్గొన్నారు.
జూన్ 10 నుంచి అమ్మకాలు ప్రారంభించాలి
నగరంలోని పద్మనగర్ సమీకృత మార్కెట్లో వ్యాపారులు జూన్ 10వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ అదేశించారు. సమీకృత మార్కెట్లో లీజు ఒప్పందంపై షాప్లు పొందిన వ్యాపారులతో సోమవారం నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలోని కళాభారతిలో సమావేశమయ్యారు. మార్కెట్లో షాప్లు పొందిన వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించాలన్నారు. నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం ముందుగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు.
నేటి నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
కరీంనగర్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా మహాసభలు ఈనెల 27, 28వ తేదీల్లో కరీంనగర్లోని మధుగార్డెన్లో జరగనున్నాయి. జిల్లాలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చేందుకు సీపీఐ నేతలు ఆరాటపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 300 గ్రామాల్లో 149 గ్రామశాఖలు, 16 మండలాల సభలు నిర్వహించుకుని పార్టీలోకి కొత్త జవసత్వాలను నింపేందుకు నాయకత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. మొదటి రోజు భవిష్యత్ నిర్మాణంపై జిల్లా కార్యదర్శి నివేదికను ప్రవేశపెడతారు. 2వ రోజున పార్టీ కౌన్సిల్, కార్యవర్గం, కార్యదర్శి ఎన్నిక జరగనుంది. ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభశివరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్తో పాటు రాష్ట్ర నాయకులు, తదితరులు హాజరుకానున్నారు.
కనీస వేతన చట్ట సవరణ చేయాలి
కరీంనగర్టౌన్: తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ లోపు కనీస వేతన చట్ట సవరణ చేయాలని, లేనిపక్షంలో కార్మికులతో కలిసి చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తామని బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పప్పుల సురేశ్ తెలిపారు. సోమవారం కరీంనగర్లోని బీఎంఎస్ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్లో జరిగిన బీఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కార్మికుల సంక్షేమం కోసం కొన్ని తీర్మానాలు ఆమోదించడం జరిగిందన్నారు. ముఖ్యంగా 18ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కనీస వేతన చట్ట సవరణ చేయాలని, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐఎస్ సెంటర్లో మందుల కొరత లేకుండా చూడాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే అంశాలపై తీర్మానం చేసినట్టు వివరించారు. జిల్లా అధ్యక్షుడు పసుల శ్రవణ్, కార్యదర్శి తొర్తి శ్రీనివాస్, నాయకులు కర్ణకంటి సత్యం, మొగిలిపాలెం తిరుపతి, రేణికుంట శంకర్ పాల్గొన్నారు.
శాతవాహనకు 35 లెక్చరర్ పోస్టులు మంజూరు
కరీంనగర్టౌన్: శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిన 35 లెక్చరర్ పోస్టులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ స్ట్రీమ్ పద్ధతిన 10 పోస్టులు... ఇందులో ఎకనమిక్స్ (2), కామర్స్ (2), బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (2), ఆర్గానిక్ కెమిస్ట్రీ (2), ఫిజికల్ కెమిస్ట్రీ (2), సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిన 25 పోస్టులు... ఇందులో తెలుగు (4), ఇంగ్లిష్ (4), కామర్స్ (3), బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (2), ఎఫ్ఎస్టీ (4), బాటనీ (3), మ్యాథమెటిక్స్ (2), కంప్యూటర్ సైన్స్ (3) పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.