చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే అంబటిపై దాడి
రాష్ట్రంలో నీచమైన పాలన
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి జరిగిందని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి నివాసంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలసి పరామర్శించారు. అంబటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రక్షించాల్సిన వారినే అడ్డుపెట్టుకుని దాడులు చేయటాన్ని చూసి రాష్ట్ర ప్రజలంతా ఉలిక్కిపడ్డారన్నారు. ఇది కూటమి పతనానికి నాంది అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు దేవుడిపై భక్తి, గౌరవం రెండు లేవని తేలిపోయిందన్నారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకున్నారని అంటున్నారని, ఏదైనా సభలకో, ఎక్కడైనా వెళ్లినప్పుడు వారు ఇస్తే పట్టుకోవటం తప్పా అని ప్రశ్నించారు. భిన్నత్వంలో ఏకత్వంగా నిలిచే భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. పరమతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిపోయిందని, ఆ ఘోరాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదించాలని చూశారన్నారు. దీనిని ప్రజలతో పాటు భగవంతుడు కూడా చూశాడని కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్లు మూల్యం చెల్లించుకునే రోజు వస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పలువురు పాల్గొన్నారు.
అంబటిని పరామర్శించిన లక్ష్మీపార్వతి
మాజీ ఎమ్మెల్యే
మొండితోక జగన్మోహనరావు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : రాష్ట్రంలో నారా లోకేష్, చంద్రబాబునాయుడు డైరెక్షన్లో నీచమైన పాలన కొనసాగిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం రాంబాబును పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. పెట్రోల్ బాంబులు వేసి ఇళ్లను తగలబెట్టే దృశ్యాలను సినిమాల్లోనే చూసేవాళ్లం..కాని ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు పాలనలో చూస్తున్నామన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు చూస్తుంటే ఎవరో ఒకరిని చంపేసే ఉద్దేశంతోనే చేసినట్లుగా ఉందన్నారు. రాష్ట్రానికి పట్టిన తండ్రి, కొడుకుల పీడ విరగడ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు.


