‘ఎర్ర’ బంగారానికి ‘సౌర’ రక్షణ
తాడికొండ: ఈ ఏడాది మిర్చి పంటకు తెగుళ్ల బెడద లేకపోవడంతో నాణ్యత కలిగిన కాయలు కోతకు వస్తున్నాయి. దీంతో ధరలు కూడా రూ.20 వేలు– రూ.23 వేల వరకు వివిధ రకాలు పలుకుతుండటంతో రైతులు తమ ఎర్ర బంగారాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తాడికొండ మండలం రావెల గ్రామంలో ఓ రైతు సౌర విద్యుత్తుతో వెలిగే దీపాలు, సీసీ కెమెరాను స్తంభానికి ఏర్పాటు చేయించారు. ఏటా మిర్చి కల్లాల్లో కాయలు చోరీకి గురవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతుండే వారు. దీనికి చెక్ పెడుతూ రైతు తీసుకున్న నిర్ణయం పలువురిని ఆలోచింపజేస్తోంది. రావెల, మందపాడు తదితర గ్రామాల్లో పనుల కోసం కర్నూలు ప్రాంతం నుంచి వలస కూలీలు రాక పెరగడంతో పొలాల్లోనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏటా అంధకారంలోనే గడిపేవారు. ఇప్పుడు వారుంటున్న ప్రాంతాల్లో రైతులు సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రివేళ పొలాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి.


