రోడ్డుప్రమాదంలో జేఎల్ఎం మృతి
నకరికల్లు: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీబస్సు ఢీకొన్న ఘటనలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని దేచవరం సమీపంలో నరసరావుపేట రోడ్డులో బుధవారం జరిగింది. నకరికల్లుకు చెందిన జూపల్లి రాజారత్నం (38) గత ఆరేళ్లుగా గుండ్లపల్లి గ్రామంలో గ్రేడ్–2 జేఎల్ఎం (ఎనర్జీ అసిస్టెంట్)గా పనిచేస్తున్నాడు. కాగా నరసరావుపేటలోని అక్కయ్య వాళ్లింటికి వెళ్లాడు. మండలంలోని త్రిపురాపురం గ్రామంలో విద్యుత్బిల్లుల డ్యూటీ ఉండడంతో విధుల్లో హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై నకరికల్లుకు తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దేచవరం మిద్దె సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.సతీష్తో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్శాఖ ఈఈ రాంబొట్లు, డీఈఈ వెంకటేశ్వరరెడ్డి, ఏఈ సుచరిత, పలువురు లైన్మెన్లు మృతదేహానికి ఘననివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
వక్కపట్లవారిపాలెం వద్ద ఘటన
నాగాయలంక: మండలంలోని నాగాయలంక – అవనిగడ్డ మెయిన్ రోడ్డుపై వక్కపట్లవారి పాలెం సమీపంలో బుధవారం ప్రయాణికులతో వస్తున్న ఆటోలో సాంకేతిక లోపాల కారణంగా ఆకస్మికంగా పల్టీ కొట్టిందని ఎస్ఐ కలిదిండి రాజేష్ తెలిపారు. బాపట్ల జిల్లా అల్లపర్రు గ్రామం నుంచి నాగాయలంక మండలంలోని పర్రచివర గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో పాలెం సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై పంటకాలువ వైపు బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో పది మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో వర్రే శివయ్య(60)కు కాలు విరిగిందని, బండ్రెడ్డి రాఘవమ్మ(60) మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని ఎస్ఐ చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ అలపర్రుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులని, ఆటో కూడా ఆ సభ్యుల్లో ఒకరిదని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.
రేపల్లె: వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి జహీరుద్దీన్ (55) నేషనల్ హైవే రహదారి పేటేరు బస్సు షెల్టర్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జహీరుద్దీన్ను పరిశీలించగా.. అప్పటికే మృతి చెంది ఉన్నాడు. క్రిమిసంహార ముందు తాగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ధాన్యంకు సంబంధించిన నగదు చెల్లింపులపై ఇటీవల పోటుమేరక గ్రామానికి చెందిన రైతులు బలవంతం పెట్టి అతని కుమారుడు జాఫర్వలిపై దాడిచేసి బంధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగదు చెల్లించి కుమారుని తీసుకువెళ్లాలని ఒత్తిడి చేయడంతో జహీరుద్దీన్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో జేఎల్ఎం మృతి
రోడ్డుప్రమాదంలో జేఎల్ఎం మృతి


