గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ
15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకుండా కక్షగట్టిన చంద్రబాబు సర్కార్ వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి
తాడేపల్లి రూరల్: టీడీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి జరగకుండా, పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యాలయంలో పంచాయతీ కమిషనర్కు సర్పంచ్ల సమస్యలపై ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అడుగులు వేస్తూ పరిపాలన సాగించారు. కానీ టీడీపీ ప్రభుత్వం సర్పంచ్లపై మీద కక్షకట్టి గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటోంది. స్థానిక ప్రజాప్రతినిధులు అధిక శాతం వైఎస్సార్సీపీకి చెందిన వారు ఉండటంతో టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది’ అని విమర్శించారు. ఏప్రిల్ 2న సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుందని, గ్రామాల్లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాల మేరకు చేసిన ఎంబుక్లో రికార్డు అయిన బిల్లులను కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తూ వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. సర్పంచుల పదవీ కాలం తర్వాత స్పెషల్ ఆఫీసర్ల నియామకం పేరుతో ఆ నిధులను దోచుకోవాలని కుట్ర జరుగుతుందని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శులు ఫిరోజ్ఖాన్, నామా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


