దళారుల చేతిలో మోసపోకండి
ప్రత్తిపాడు: రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని జిల్లా వ్యవసాయాధికారి ఎం. పద్మావతి అన్నారు. విత్తనాలు నుంచి పంటి విక్రయం వరకు ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పెదనందిపాడు మండలం పాలపర్రులోని జీడీసీఎంఎస్లో సోమవారం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎం.పద్మావతి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పద్నాలుగు శాతం తేమ ఉండేలా చేసుకోవాలన్నారు. తొలుత రైతులు రైతు సేవ కేంద్రాల్లో ఈకేవైసీ చేయించుకుని, ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం ఎకరానికి పన్నెండు క్వింటాళ్ల చొప్పున, ఒక రైతు 40 క్వింటాళ్ల వరకు విక్రయించుకోవచ్చని వివరించారు. ఈ క్రాప్ ఆధారంగా జీడీసీఎంఎస్ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర రూ. 5,870కు శనగలు విక్రయించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ డీఎం టి. నరసింహారెడ్డి, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎన్. మోహన్రావు, మండల వ్యవసాయ అధికారి ఐ. సుబ్రహ్మణ్యం, రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి
ఎం.పద్మావతి


