దంపతుల మధ్య గొడవ
● భర్తపై మరో వ్యక్తి దాడి● చికిత్స పొందుతూ బాధితుడి మృతి
మంగళగిరి టౌన్: భార్యాభర్తలు గొడవ పడుతుండగా మరో వ్యక్తి వచ్చి భర్తపై దాడి చేయడంతో గాయాలపాలైన చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా, ఈపూరు మండలం, అంగలూరు తండాకు చెందిన జరపాల వెంకటేశ్వర నాయక్ (30), భార్య ప్రియాంక బాయితో మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి పనుల నిమిత్తం వచ్చారు. ఓ ప్రైవేటు కంపెనీలో లేబర్ వర్క్ చేస్తూ ఆ కంపెనీ ఇచ్చిన ఇంటిలో ఉంటూ రోజూ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వెంకటేశ్వర నాయక్ మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. భర్తను ప్రతిఘటిస్తున్న క్రమంలో అక్కడే పనిచేస్తున్న కృష్ణ అనే వ్యక్తి వెంకటేశ్వర నాయక్ తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. అతడు కింద పడిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారు గాయాలపాలైన దంపతులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. వెంకటేశ్వర నాయక్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి వాక్యా నాయక్ ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గుణదల(విజయవాడ తూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన గడ్డం సుమంత్(28) గత కొంత కాలంగా మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద స్వీట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మూడు నెలల క్రితం పరిచయమైన రామలక్ష్మి అనే మహిళతో సహజీవనం చేస్తూ.. ఇద్దరూ అదే ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య వ్యక్తి గత విషయాలపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచీ ఇంట్లోనే ఉన్న సుమంత్ ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటికి అక్కడకు వచ్చిన రామలక్ష్మి అతనిని చూసి కంగారు పడి కేకలు వేసింది. అంతలో అక్కడకు చేరుకున్న స్థానికులు మృతుడిని కిందకి దించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
దంపతుల మధ్య గొడవ


