వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని గాలికొదిలేసిన కూటమి సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని గాలికొదిలేసిన కూటమి సర్కార్‌

May 30 2025 1:26 AM | Updated on May 30 2025 1:55 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రగల్బాలు 

చంద్రబాబు పాలనలో కార్మికులకు తప్పని కష్టాలు 

జీవో నెంబర్‌ 21, 31ల రద్దుకు ఆటోడ్రైవర్లు డిమాండ్‌ 

వైఎస్‌ జగన్‌ పరిపాలనలో డ్రైవరన్నలకు ఎంతో భరోసా

కొత్త జీవోలతో రవాణా రంగం నిర్వీర్యం

పట్నంబజారు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల ఆటోలు, 10 వేల వరకు కార్లు (ట్యాక్సీ ప్లేట్‌) ఉన్నాయి. 2019–24 మధ్య ఈ కార్మికులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో అండగా నిలిచింది. ప్రతి ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌, మాక్సీ డ్రైవర్‌లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిని అన్ని విధాలుగా ఆదుకుంది. వైఎస్సార్‌లో... ఎస్‌ అనే అక్షరాన్ని శ్రామికులకు అంకితం చేసిన ఘనత వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కార్మికులకు అండగా తాను ఉంటూ భరోసా కల్పించారు. రూ.10 వేలు ఏటా అందజేసి కార్మిక కుటుంబాలకు అండగా నిలబడ్డారు. 

వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవరన్న సంక్షేమానికి తోడ్పాటు అందించారు. ఏడాదికి రూ.10 వేలు అందించటం ద్వారా ఆటోడ్రైవర్‌లు, కార్‌ డ్రైవర్‌లకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌పీ), ఇన్సూరెన్స్‌, ఇతరత్రా అవసరాలకు ఎంతగానో ఉపయోపడేది. దీంతో పాటుగా నవరత్నాలకు సంబంధించి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయంబర్స్‌మెంట్‌తోపాటు అనేక సంక్షేమ పథకాలు ప్రతి డ్రైవరన్న ఇంటి ముంగిటకు తీసుకెళ్లిన ఘనత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానిదే. 2024 ఎన్నికల్లో ఆటో, ట్యాక్సీ డ్రైవర్‌లతోపాటు హెవీ, టిప్పర్‌ లైసెన్స్‌లు ఉన్న వారికి రూ ఏడాది రూ.15వేలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో చెప్పారు. కూటమి పాలన ఏడాది పూర్తి కావస్తున్నా కనీసం ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరికీ అందజేసిన పాపాన పోలేదు. చాలామంది ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి కింద ఆటోలు, వ్యాన్లు, కార్లు, జీపులు వంటి వాహనాలను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ల నుంచి అప్పు చేసి మరీ తీసుకుని నడుపుతున్నారు. 

ఇలా ప్రభుత్వానికి రూ.కోట్లు పన్నులు చెల్లిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. ఒకవైపు భారీగా పెరిగిన నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో డ్రైవర్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల సమయంలో జీవో నెంబర్‌ 21 రద్దు చేసి, వాహనదారులపై పడుతున్న గ్రీన్‌ ట్యాక్స్‌ను కూడా తగ్గిస్తామని కూటమి చెప్పింది. అధికారంలో వచ్చిన తరువాత కూడా 21, 31 నంబరు జీవోలతో భారీ జరిమానాలతో తమకు వస్తున్న అంతంత మాత్రం ఆదాయంలో చాలా వరకు నష్టపోతున్నామని డ్రైవర్లు, మోటారు వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీగా జరిమానా

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో అమలు చేస్తున్న జీవో నంబరు 21తో డ్రైవర్లపై భారీ జరిమానాలు విధిస్తూ ఆర్థికంగా నడ్డి విరుస్తున్నారు. గతంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌, పాల్యూషన్‌, ఇన్సూరెన్స్‌ లేకపోతే రూ.500 నుంచి రూ.750 వరకు జరిమానాలు విధించేవారు. ప్రస్తుతం జీవో నంబరు 21 వచ్చాక డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోతే రూ.5 వేలు, పర్మిట్‌ లేకపోతే రూ.10 వేలు, ఇన్సూరెన్సు లేకుంటే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోతే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, ఫిట్నెస్‌ లేకపోతే రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు. దీంతో రవాణా రంగంతోపాటు, డ్రైవర్‌లపైనా పెనుభారం పడుతోంది.

వైఎస్సార్‌ సీపీ హయాంలో......

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా జిల్లా వ్యాప్తంగా అర్హత గల ట్యాక్సీ, ఆటో, మ్యాక్సీ క్యాబ్‌తోపాటు పలు వాహనాల డ్రైవర్‌లకు రూ.10 వేలు చొప్పున అందజేశారు. తాను కార్మికుల పక్షపాతినని ఆయన చాటి చెప్పారు. డ్రైవర్లకు అందించిన సాయాన్ని పట్టికలో చూడొచ్చు.

ఇవన్నీ ఎంతో కీలకం

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌, ఆటో విడి భాగాల ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఆటో డ్రైవర్ల ఆదాయానికి నష్టం కలిగించే ఆన్లైన్‌ యాప్స్‌ రద్దు చేయాలి. పాత ఈ– చలానాలు రద్దు చేయాలి. డ్రైవర్లకు వ్యక్తిగత బీమా రూ.10 లక్షలు అమలు చేయాలి. కేంద్రం విడుదల చేసిన 894 గెజిట్‌ రద్దు చేయాలి. ప్రమాదాల నివారణ పేరుతో డ్రైవర్లకు ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించే యాక్టు 106(1) (2) ప్రమాదకరం. జీవో 21, 31 రద్దు చేస్తే డ్రైవర్లకు మేలు జరుగుతుంది.

వీటి సంగతి ఏంటో..

బ్యాడ్జి కలిగిన అన్ని వాహనాల డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం

భారీ జరిమానాలకు కారణమవుతున్న జీవో సంబరు 21, 31ల రద్దు

డీజీల్‌, పెట్రోల్‌ ధరల తగ్గింపు

టాటా మ్యాజిక్‌ వ్యాన్లు, జీపులు, కార్లకు గ్రీన్‌ టాక్స్‌, లేబర్‌ టాక్స్‌, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌, టోల్‌ గేట్‌ ఫీజుల తగ్గింపు

డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, విద్యా రుణాలు మంజూరు

చంద్రన్న బీమా ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

రవాణా రంగంలోకి ఆన్లైన్‌ యాప్స్‌ వచ్చాక ఆటో డ్రైవర్లు బేరాలు లేక నష్టపోతున్న పరిస్థితి. రోజంతా తిరిగితే రూ.500 నుంచి రూ.800 వరకు వస్తోంది. డీజిల్‌, ఇతర ఖర్చులు పోనూ మిగిలే రూ.200తో కుటుంబాన్ని నెట్టుకురావాలి. ఇటువంటి దయనీయ పరిస్థితిలో కొత్త జీవోలతో భారీ జరిమానాలు చెల్లించలేక అప్పులపాలవుతున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.10 వేలు వాహనమిత్ర ఇచ్చేది. ఆటోల మరమ్మతులు వంటి వాటికి ఉపయోగపడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

– వరగాని ప్రవీణ్‌కుమార్‌, ఆటోడ్రైవర్‌

వైఎస్సార్‌సీపీ హయాంలో అందిన సహాయం

సంవత్సరం లబ్ధిదారుల అందించిన సాయం

సంఖ్య (రూ.కోట్లలో)

2019–20 20,594 20.95

2020–21 25,177 25.18

2021–22 23,837 23.84

2022–23 12,137 12. 13

2023–24 12,540 12.54

మొత్తం 94,645 94.64

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement