నిందితుడి నుంచి 108 గ్రాముల బంగారం, కిలో వెండి రికవరీ
నరసాపురం రూరల్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తుడిని నరసాపురం టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 108 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నరసాపురం పట్టణానికి చెందిన గంగులకుర్తి శ్రీనివాసరావు మార్చి 27న కుటుంబంతో కలసి షిరిడీ యాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాసరావు ఇంటి తాళాల పగులగొట్టి బంగారు, వెండి ఆభరాణాలను అపహరించారు. ఈనెల 6న యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాసరావు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం నరసాపురం మెయిన్రోడ్డువద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు తణుకు పట్టణానికి చెందిన సింగారపు ఈశ్వరరావుగా గుర్తించారు. అతడిపై నరసాపుపరంతో పాటు ఏలూరు, తాడేపల్లిగుడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, రాజమండ్రి వంటి సుమారు 20 ప్రాంతాల్లో చోరీ కేసులు ఉన్నాయి. కేసు ఛేదనలో చురుగ్గా వ్యవహరించిన నరసాపురం టౌన్ సీఐ యాదగిరి, సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.


