వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా నేత ఇంట్లోకి పోలీసుల చొరబాటు అరెస్టుకు ప్రయత్నాలు అడ్డుకున్న గ్రామస్తులు
కొల్లూరు: మండలంలోని చినపులివర్రు గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్థించడం ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వేమూరు నియోజకవర్గ కన్వీనర్ బాణాల తనీష్బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఆదివారం తెల్లవారుజామున మఫ్టీలో తనీష్బాబు ఇంటికి వెళ్లిన పోలీసులు గోడలు దూకి ఇంటిలోకి వెళ్లి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రశ్నించిన తనీష్బాబు భార్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు గ్రామానికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనీష్కు మద్దతుగా వస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులను, చినపులివర్రు వాసులను వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, వివిధ పోలీసుస్టేషన్ల ఎస్ఐలు అడ్డగించారు. కొల్లూరు సమీపంలో రేపల్లె ● తెనాలి ప్రధాన రహదారిపై భారీగా మోహరించిన పోలీసులు అశోక్బాబు, తనీష్ కుటుంబ సభ్యులు మాత్రమే స్టేషన్ వద్దకు రావాలని ఆంక్షలు విధించారు. స్టేషన్ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం కొల్లూరు పోలీసుస్టేషన్లో తనీష్కు పోలీసులు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సమక్షంలో 41 నోటీసులు అందజేశారు. అనంతరం తనీష్ భార్య అనూష పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు.


