నగరంపాలెం: జిల్లాలోని న్యాయస్థానాలలో కేసులు పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతి కోర్టుకు ఒక కానిస్టేబుల్ను నియమించనున్నట్లు సీఐలు ప్రభాకర్ (డీసీఆర్బీ), ధర్మేంద్రబాబు (కోర్టు మానిటరింగ్ సిస్టం– సిఎంఎస్) చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో ‘కోర్టుల వారీగా అంకితభావం కల్గిన కానిస్టేబుళ్లు మోడల్పై నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించారు. సీఐలు మాట్లాడుతూ ఇప్పటి దాకా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను/పత్రాలను కోర్టులలో దాఖలు చేసేవారని అన్నారు. ఆ కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రతి పోలీస్స్టేషన్ (పీఎస్) నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు విధులు నిర్వర్తించేవారని గుర్తుచేశారు. ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి కోర్టుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని కేటాయిస్తారని తెలిపారు. కోర్టులలో ఫైల్ చేసిన కేసులకు సంబంధించి పీఆర్సీ నంబర్లు, కేసు చార్జిషీటు దాఖలు చేశాక సీసీ నంబర్లు వచ్చేలా పర్యవేక్షించాలని అన్నారు. బాధితులకు న్యాయం అందించేందుకు సాక్షులను, ఆధారాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి పరిష్కరించాలని అన్నారు. విచారణ కేసులకు హాజరవ్వని ముద్దాయిలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు. కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే శాతాన్ని పెంపొందించాలని అన్నారు. పీపీలు, ఏపీపీలతో సమన్వయంతో కేసుల పురోగతికి చర్యలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


