ప్రతి ఓటూ కీలకం
దోచుకోవటం
నేర్పిస్తున్న చంద్రబాబు
‘మావిగన్’ పేరు వింటేనే చంద్రబాబు వెన్నులో వణుకు
ప్రతి ఓటూ కాపాడుకోవడంలో బూత్ కమిటీల పాత్ర కీలకం
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున
బాపట్ల: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ పాలన సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బాపట్ల జిల్లా బూత్ కమిటీ సమావేశంలో స్థానిక వీ కన్వన్షన్ హాలులో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ అబద్ధాలతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని వివరించారు. ప్రజల నుంచి వ్యతిరేకతను రెండేళ్లకే చవిచూడాల్సిన పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి పట్టిందన్నారు. ప్రజల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆదరణ పెరిగిపోతోందనే విమర్శలు రోజురోజుకు పెంచుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ మరో రూ. 2లక్షల కోట్లు ఖర్చుపెడితే అందులో కమీషన్లు నొక్కేందుకు భారీ స్కెచ్ వేశారని దుయ్యబట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్ పేరుతో అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన ప్రతిపాదనకు ప్రజల్లో విశేష స్పందన వచ్చిందన్నారు. కచ్చితంగా కేవలం రూ.20 వేల కోట్లు పెడితే ఈ మూడు నగరాలను కలిపి మెరుగైన రాజధానిగా నిర్మించవచ్చని ఆయన చెప్పినట్లు గుర్తుచేశారు. బూత్ లెవల్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్క ఓటు విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి పదవులు తప్పక వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల సమన్వయకర్త కరణం వెంకటేష్బాబు, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, రేపల్లె సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, మోదుగుల బసవ పున్నారెడ్డి, యార్లగడ్డ మదనమోహన్, బాపట్ల పరిశీలకులు జి.సురేంద్ర, అద్దంకి పరిశీలకులు ప్రసాద్, పర్చూరు కోటేశ్వరరావు, పార్టీ నాయకులు వాసుమల్లి వాసు, కొక్కిలిగడ్డ చెంచయ్య, కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఇనగలూరి మాల్యాద్రి, కోకి రాఘవరెడ్డి, చల్లా రామయ్య, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, వడ్డిముక్కల డేవిడ్, దొంతిబోయిన సీతారామిరెడ్డి, కటికల యోహోషువా ఉన్నారు.
ప్రతి ఓటును కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకర్రెడ్డి సూచించారు. ఓట్లు ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా సీరియల్స్ ఉంటాయి, ఏ విధంగా చేర్పులు ఉంటాయని అనే విషయాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు.
మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలకు దోచుకోవటం, దాచుకోవటంపై సీఎం చంద్రబాబు శిక్షణ ఇచ్చి మరీ ప్రజలపైకి పంపుతున్నారని పేర్కొన్నారు. ఒక పక్క అవినీతి పెరిగిపోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబునాయుడు అమరావతిని తెరపైకి తెచ్చారన్నారు. అమరావతి కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్గా అభివృద్ధి చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించటంతో కూటమి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కోన దుయ్యబట్టారు. కచ్చితంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, కష్టపడిన ప్రతి నాయకుడికి మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.
మత్స్యకారులను ముంచేసిన ప్రభుత్వం
ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు తూమాటి మాధవరావ మాట్లాడుతూ... మత్స్యకారులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. వేట సమయంలో ఇతర దేశాలకు అనుకోని పరిస్థితులలో మన జాలర్లు వెళితే తిరిగి తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మన జలాలలోకి తమిళనాడు మత్స్యకారులు వచ్చి వేట సాగిస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. మన వారి పడవలు తమిళనాడుకు వెళ్లినప్పుడు అక్కడ భారీగా అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు.


