నరసరావుపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. నరసరావుపేటలోని బరంపేటకు చెందిన తెల్లగోర్ల చందు(28) ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం చిలకలూరిపేట వైపు నుంచి పల్సర్ బైక్ వచ్చే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిన చందు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రూరల్ పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కిషోర్ తెలిపారు.
మద్యంమత్తులో యువకుల హాల్చల్
కేసానుపల్లిలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. రోడ్డు ప్రమాదంలో చందు మృతిచెందిన సమాచారం తెలుసుకున్న కారంపూడి, ఓబులేసులపల్లి, నరసరావుపేటకు చెందిన పలువురు యువకులు ఘటనా స్థలానికి బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కేసానుపల్లిలోని వాటర్ప్లాంట్ సమీపంలోని బెల్ట్షాపులో మద్యం సేవించారు. ఈ సమయంలో బెల్ట్షాప్ నిర్వాహకుడిపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న గ్రామస్తులపై కూడా యువకులు దుర్భాషలాడారు. గ్రామస్తులు యువకులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో చిలకలూరిపేట–నరసరావుపేట రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.


