బాపట్లటౌన్: ఆటిజమ్ సెంటర్ను త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆటిజమ్ సెంటర్, భవిత సెంటర్లను కలెక్టర్ గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన వారికి జీవన నైపుణ్యాలు, వైద్యం, విద్యాబుద్ధులు నేర్పేలా ఆటిజమ్ సెంటర్ ఉపకరిస్తుందన్నారు. విభిన్న ప్రతిభావంతులైన మతిస్థిమితం లేని వారు జిల్లాలో 3,394 మంది ఉన్నారన్నారు. ఆటిజమ్తో బాధపడేవారు 79 మంది ఉన్నారన్నారు. వారందరికీ విద్యాబుద్ధులు నేర్పడం, అవసరమైన వైద్యం అందించడం, వారి జీవన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందన్నారు. ఈ కేంద్రాలను త్వరలో ప్రారంభించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. ఆటిజమ్ తో బాధపడే వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు.
మరుగుదొడ్లు పరిశీలన
కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సామాజిక మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర నిధులు, డీఎంఎఫ్ నిధులతో నిర్మించిన సామాజిక మరుగుదొడ్ల భవన సముదాయాన్ని ఆయన పరిశీలించారు. త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్కు వచ్చే ప్రజల సౌకర్యార్థం సామాజిక మరుగుదొడ్లు తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్సింగ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, సమగ్ర శిక్ష అభియాన్ సలహాదారులు రాంకమల్, విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఉన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్


