తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రత్యర్థి పార్టీల వారిని వేధించడానికే అన్నట్టుగా ఆ వ్యవస్థ నడుస్తోందని ఆరోపించారు. డీజీపీ, కొందరు ఎస్పీలు, సీఐలు పనిగట్టుకుని మరీ జులుం ప్రదర్శిస్తున్నారని చెప్పారు.
తాడేపల్లిలో టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ‘నేరస్థులను వదిలేసి వైఎస్సార్సీపీ క్యాడర్ వెంట పడుతున్నారు. రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ అనేదే లేకుండా పోయింది. గత రెండేళ్లుగా రాజకీయ కక్షసాధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారు.
బాధితుల మనోభావాలు, పరువు- ప్రతిష్ట గురించి ఆలోచించరా? పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా మార్చుకున్న చంద్రబాబు చెంపలేసుకోవాలి. కోర్టు ఆదేశాలను సైతం పోలీసు అధికారులు పట్టించుకోవటం లేదు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మహిళను మోసం చేసిన అరవ శ్రీధర్ ను ఎందుకు అరెస్టు చేయలేదు? ఎస్పీ ఆఫీసులో దూరిన ఎమ్మెల్యే అరవిందబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మరొక మహిళతో స్వామి వారిని దర్శించుకోవటం సిగ్గుచేటు. సంస్కృతిని సర్వనాశనం చేసిన బీఆర్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎమ్మెల్యేలు కూన రవికుమార్, నసీర్ అహ్మద్, కోనేటి ఆదిమూలం మహిళలను వేధిస్తే ఏం చర్యలు తీసుకున్నారు? రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారిపోయారు. అలాంటి పోలీసుల ఆటలు సాగనివ్వం.
ఎల్లాకాలం చంద్రబాబు పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకావని గుర్తుంచుకోవాలి’ అని టీజేఆర్ సుధాకర్ బాబు చెప్పారు.


