అమ్మవారికే ఎగనామం | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికే ఎగనామం

May 29 2025 7:13 AM | Updated on May 29 2025 7:19 AM

అమ్మవారికే ఎగనామం

అమ్మవారికే ఎగనామం

●ముసలమ్మ ఆలయ స్థలం ఆక్రమణ ●రూ.5 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం

బుక్కరాయసముద్రం: గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండేలా కరుణించిన ముసలమ్మ అమ్మవారికే కబ్జాదారులు ఎగనామం పెట్టారు. రూ.కోట్ల విలువైన ఆలయ భూమిని కబ్జా చేసి, ఆ స్థలంలోకి ఎవరు కాలు పెట్టినా సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దౌర్జన్యాలను తాళలేక చివరకు అన్యాక్రాంతమైన భూమిని ఆలయానికి తిరిగి స్వాధీనం చేయాలంటూ అనంతపురం ఆర్డీఓకు ముసలమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ సుశీల విన్నవించారు.

ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి నాడు ప్రాణత్యాగం

ముసలమ్మ ఆలయానికి సుదీర్ఘ చరిత్రనే ఉంది. మూడు శతాబ్దాల క్రితం బుక్కరాయసముద్రం చెరువు నిండి ఉప్పొంగి కట్టకు భారీగా గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా గ్రామంలోకి చొరబడి మునిగిపోతుండగా గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న పోలేరమ్మ తల్లిని ప్రార్థించారు. ఆ సమయంలో ‘గ్రామంలో ఉన్న బసిరెడ్డి చిన్నకోడలు ముసలమ్మ ప్రాణత్యాగంతో కట్ట నిలుస్తుంది’ అనే మాటలు వినిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ముసలమ్మ దేవుడిని ప్రార్థిస్తూ గండి పడిన చోట చెరువులోకి దూకింది. దీంతో వరద నీరు నిలిచిపోయిందట. అప్పటి నుంచి ముసలమ్మను ఇలవేల్పుగా గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రాణత్యాగం చేసిన ముసలమ్మకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. అనంతరం కాలంలో రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

అమ్మోరు స్థలానికే ఎసరు

ముసలమ్మ ఆలయం వెనుక సర్వే నంబర్‌ 636–4లో 80 సెంట్ల స్థలం బెంగళూరుకు చెందిన ఆదెమ్మ పేరుపై డైక్లాట్‌లో ఉంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దకుమార్తె మునిరత్నమ్మ పేరుపై 1933లో రిజిస్టర్‌ చేయించి ఇచ్చింది. ఆ తర్వాత ఆ స్థలాన్ని 1949, ఫిబ్రవరి 10న ముసలమ్మ ఆలయంలో నిత్యకై ంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా అమ్మవారి వంశస్తులైన తిరుమలరెడ్డి గారి కొండారెడ్డికి దాన విక్రయం కింద మునిరత్నమ్మ రాసిచ్చారు. అప్పటి నుంచి పాత గుడిలో అమ్మవారికి నిత్య పూజలు కొనసాగుతూ వచ్చాయి. కాలక్రమేణ గుడిని అభివృద్ది చేశారు. ఈ క్రమంలో 33 సెంట్ల స్థలాన్ని అనంతపురానికి చెందిన వెంకట్రాముడు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ముసలమ్మ వంశస్తులతోనే ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించాడు. ఆ స్థలం తనదని, అక్కడ ఎవరు కాలు పెట్టినా సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఇదే విషయంపై రెవెన్యూ అధికారులకు ఆలయ ధర్మకర్త సుశీల, ఆమె భర్త సూర్యనారాయణరెడ్డి, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్‌ పుణ్యవతిని కలసి ఆలయ భూమిని పరిరక్షించాలంటూ విన్నవించారు. అన్యాక్రాంతమైన భూమి విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుందని, వెంకట్రాముడితో పాటు మరికొందరు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement