
కౌలు రైతు ఆత్మహత్య
బెళుగుప్ప: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన తలారి జయరాములు (55)కు భార్య శారదమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఏటా 10 నుంచి 15 ఎకరాల్లోని మామిడి చెట్లను గుత్తకు తీసుకుని ఫల సాయాన్ని మార్కెట్కు తరలించేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది అదే గ్రామంలోని 12 ఎకరాల్లో మామిడి తోటను గుత్తకు తీసుకున్నాడు. ఇందుకు గాను చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు పైగా చేరుకుంది. మామిడి దిగుబడులు సరిగా రాకపోవడంతో పాటు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక సోమవారం సాయంత్రం మామిడి తోటలో పురుగుల మందు తాగాడు. గమనించిన పక్క పొలంలోని రైతులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించిన కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక అదే రోజు రాత్రి ఆయన మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ తెలిపారు.