
త్వరలోనే రాష్ట్రంలో రుతురాగం
నైరుతి రుతుపవనాలు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి.
బుధవారం కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు
నైరుతి రుతుపవనాలు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. బుధవారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో కేరళ సహా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాలు ఈనెల 12 నుంచి 15వ తేదీ మధ్య ఎప్పుడైనా తెలంగాణలో కి ప్రవేశించవచ్చని హైదరాబా ద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ముందుగా మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. తర్వాత రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు.
- సాక్షి, హైదరాబాద్
సాధారణం కంటే అధికం అలా..
ఈసారి నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది విభిన్నమైన వాతావరణ పరిస్థితులే దీనికి కారణం. పరస్పర విరుద్ధ చర్యలు కలిగించే ఎల్నినో, లానినాలు వాతావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జూన్ మధ్య నాటికి పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ఎల్నినో ప్రభావం పూర్తిగా తగ్గి.. లానినాగా మారుతుంది. జూన్, జూలై, ఆగస్టు నాటికి ఎల్నినో ప్రభావం 6% పడిపోయి... లానినా 26 % నుంచి 52% చేరుకోనుంది. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67% చేరుకోనుంది. ఈ ఏడాది చివరకు 80 %చేరువలోకి వెళ్లనుంది. దీంతో జూలై నుంచి భారీవర్షాలు ఊపందుకుంటాయని...ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీవర్షాలు కురిసే అవకా శముందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి రుతుపవనాల కారణంగా సాధారణంతో పోలిస్తే 106% వర్షపాతం న మోదవుతుందని అంచనా వేశారు. కరువుతో విలవిలలాడుతున్న తెలంగాణకు ఈసారి అ ధిక వర్షాలు ఉపశమనం కలిగించనున్నాయి.
వారం ఆలస్యంగా..
ఈసారి నైరుతి రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా కేరళను తాకాయి. 50 ఏళ్ల సరాసరి లెక్కల ప్రకారం నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళను తాకాల్సి ఉండగా... ఏడో తేదీన (నాలుగు రోజులు అటూఇటుగా) తాకుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దానికి మరో రోజు తర్వాత రుతుపవనాలు కేరళను తాకాయి. ఇదే గతేడాది నైరుతి రుతుపవనాలు జూన్ ఐదో తేదీన కేరళను తాకగా.. పదో తేదీన ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించాయి. 13న తెలంగాణవ్యాప్తంగా ఒక్కసారిగా విస్తరించాయి. ఈసారి 12-15 తేదీల మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అయితే రుతుపవనాలు సకాలంలోనే కేరళను తాకినా రాష్ట్రానికి చేరేందుకు ఒక్కోసారి 15-20 రోజులు పట్టే అవకాశం కూడా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఇప్పటికే బంగాళాఖాతంలో నెలకొని ఉన్న ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వైపు ఆవరించి ఉన్న అల్పపీడన ద్రోణిల కారణంగా వచ్చే 4 రోజులు రాష్ట్రంలో అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వె ల్లడించింది. గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో వచ్చే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం నగరంలో 31.7 డిగ్రీలు గరిష్ట, 22.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా హన్మకొండలో 35.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
24 గంటల్లో ఏపీకి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో (శుక్రవారం నాటికి) దక్షిణ ఏపీలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ‘నైరుతి’ కేరళను తాకిన వారం రోజుల్లో ఏపీలోని అనంతపురం, కడప జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. అందుకు భిన్నంగా కేరళను తాకిన రెండ్రోజుల్లోనే ఏపీకి రానుండడం విశేషం. కొద్ది రోజులుగా ఉత్తర కోస్తాపై ఉపరితల ఆవర్తనం బలంగా ఉంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల మీదుగా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ రెండూ రుతుపవనాలు సత్వరమే ఏపీలో ప్రవేశించడానికి దోహదపడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.