
ఉజ్వల భవిష్యత్తుకు సోపానం
జవహర్ నవోదయలో విద్యాభ్యాసం..
రాజంపేట టౌన్ : జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే చాలు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. అన్నమయ్య జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి రాజంపేట మండలం ఆకేపాడు పంచాయతీలోని నారమరాజుపల్లెలో, మరొకటి మదనపల్లె మండలం వలసపల్లెలో ఉంది. ఒక్కో విద్యాలయంలో ఆరవ తరగతిలో 80 సీట్లను భర్తీ చేసేందుకు ప్రతి ఏటా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన దాదాపు 10 వేల మందికి పైగా విద్యార్థులు ప్రతి ఏటా ప్రవేశ పరీక్షను రాస్తున్నారు. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్య లభించి తద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రవేశ పరీక్షను రాయిస్తారు. అందువల్ల పోటీ తీవ్రంగా ఉంటుంది. పోటీకి తగ్గట్లు ప్రశ్నాపత్రం సరళి కూడా కొంత కఠినతరంగానే ఉంటుంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో చదివిన విద్యార్థులకు రాజంపేటలోని నవోదయ విద్యాలయంలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదివిన విద్యార్థులకు మదనపల్లెలోని నవోదయ విద్యాలయంలో సీట్ల కేటాయింపు ఉంటుంది. కాగా ఓ ప్రణాళికాబద్ధంగా ఇష్టంతో కష్టపడి చదివితే సీటు సాధించడం పెద్దకష్టం కాదంటున్నారు విద్యావేత్తలు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం కొన్ని దశాబ్దాల క్రితమే దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 1984వ సంవత్సరం మదనపల్లెలో, 1987వ సంవత్సరం రాజంపేటలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి. మదనపల్లెకు చెందిన నవోదయ విద్యాలయం తొలుత హార్సిలిహిల్స్లో ఏర్పాటయింది. అనంతరం మదనపల్లె మండలం వలసపల్లెలో ఏర్పాటు చేశారు. క్రమశిక్షణతో మెరుగైన విద్యను అందించడం జవహర్ నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. 2026–2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ ఎం. గీత తెలిపారు.
దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు వీరే
● ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు.
● అలాగే ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదవ తరగతి తప్పని సరిగా చదివి ఉండాలి.
● ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా 2025–2026 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే సీటు లభిస్తుంది.
● నోటిఫికేషన్లో పొందు పరిచిన విధంగా గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల వారికి సీట్లు కేటాయిస్తారు.
● గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 75 శాతం, పట్టణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం సీట్ల కేటాయింపు ఉంటుంది.
● గతంలో పరీక్ష రాసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
ఇవీ ప్రయోజనాలు..
● నవోదయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి సీటు పొందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో ఉచితంగా విద్య అందిస్తారు.
● మెరుగైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతి సౌకర్యం, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం అన్ని ఉచితంగా కల్పిస్తారు.
● విద్యార్థులకు వేర్వేరుగా వసతి, భోజన సౌకర్యం ఉంటుంది.
● విద్యాబోధన మాత్రం కంబైన్డ్ విధానంలో ఉంటుంది.
● కంప్యూటర్ కోర్సుతో పాటు ఎన్సీసీ, స్కౌట్ అండ్ గైడ్స్, సంగీతం, నృత్యం, డ్రాయింగ్, క్రాఫ్ట్, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
సీట్ల కేటాయింపు ఇలా..
● ఆరవ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఈ సీట్ల భర్తీకే ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది.
● 80 సీట్లలో 60 సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో, 20 సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు.
రిజర్వేషన్ సౌకర్యం ఇలా..
● బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
● గ్రామీణ ప్రాంత విద్యార్థుల సీట్ల భర్తీలో 9 సీట్లను ఎస్సీలతో, ఐదు సీట్లు ఎస్టీలతో భర్తీ చేస్తారు.
● పట్టణ ప్రాంత విద్యార్థుల సీట్ల భర్తీలో మూడు సీట్లు దివ్యాంగులకు, మూడు సీట్లు ఎస్సీలకు, ఒక సీటు ఎస్టీలతో భర్తీ చేస్తారు.
పరీక్షా విధానం ఇలా..
● మొత్తం నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది.
● మెంటల్ ఎబిలిటీ, గణితం, పేరాగ్రాప్స్ ఇలా మూడు విభాగాల్లో 80 ప్రశ్నలు ఉంటాయి.
● మెంటల్ ఎబిలిటీకి (మేధాశక్తి)కి సంబంధించి 50 మార్కులకు గాను 40 ప్రశ్నలు పది భాగాల్లో ఉంటాయి. ఒక్కో భాగంలో నాలుగు ప్రశ్నలు డయాగ్రమ్స్ రూపంలో ఉంటాయి.
● గణితంకు సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి.
● పేరాగ్రాప్స్కు సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి.
● ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 29–7–2025
● ప్రవేశ పరీక్ష తేదీ – 13–12–2025
సీటు సాధిస్తే.. బంగారం లాంటి జీవితం
ఆరవ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల
ప్రణాళికాబద్ధంగా ఇష్టంతో చదివితే
సీటు సొంతం
జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాలు
ఆరునెలలు ఆటలను కట్టిపెట్టాలి
విద్యార్థులు ఆరునెలల పాటు ఆటలు కట్టి పెట్టి సమయాన్ని వృథా చేసుకోకుండా కష్టపడి చదితే నవోదయ విద్యాలయంలో సీటు సాధించవచ్చు. నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. టెన్త్లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతటి శ్రద్ధ తీసుకుంటారో అంతకన్నా ఎక్కువగా నవోదయ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చదివిస్తే తప్పక సీటు లభిస్తుంది. నవోదయ విద్యాలయంలో విద్యార్థులు సీటు సాధించాలంటే తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమైనది.
– కొండూరు రఘునాథరాజు, ఎంఈఓ, రాజంపేట

ఉజ్వల భవిష్యత్తుకు సోపానం