
నేటి నుండి చౌక దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ
కడప సెవెన్రోడ్స్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జూన్ 1వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీని రేషన్ షాపుల ద్వారా మాత్రమే పంపిణీ చేయనున్నట్లు జేసీ అదితిసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం డీలర్ల ద్వారా ఆదివారాలు, సెలవు దినాలతోసహా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించనున్నామన్నారు. నిత్యావసర సరుకులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కార్డుదారులకు పంపిణీ చేస్తామన్నారు. పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులో ఉన్నందున, కార్డుదారులు తమకు సమీపంలోని ఏ రేషన్ షాప్ నుండైనా సరుకులు పొందవచ్చని, ఈ సౌకర్యాన్ని రైస్ కార్డుదారులందరూ సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు లేదా అంగ వైకల్యం ఉన్నవారు లేదా అనారోగ్యంతో మంచం మీద ఉన్న కార్డుదారుల ఇంటి వద్దకే.. డీలరు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల్లోగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తారని జేసీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ ఈఈలుగా అదనపు బాధ్యతలు
కడప సెవెన్రోడ్స్: జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు ఈఈలు శనివారం ఉద్యోగ విరమణ చేయడంతో వారి స్థానాల్లో ఇద్దరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు జీవీ శ్రీనివాసులురెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు పీఆర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తున్న ఎం.శ్యామసుందర్రాజు రిటైర్డ్ అయ్యారు. రాజంపేట పీఆర్ఐ డివిజన్ ఈఈగా పనిచేస్తున్న ఎం.రామచంద్రనాయక్కు జమ్మలమడుగు ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఎఫ్ఏసీగా వ్యవహరిస్తారు. ఇప్పటిదాక జమ్మలమడుగు పీఆర్ఐ డివిజన్ ఈఈగా ఉన్న శ్యామసుందర్రాజు పులివెందుల పీఆర్ఐ డివిజన్ ఈఈ ఎఫ్ఏసీగా ఉండేవారు. ఆయన రిటైర్డ్ కావడంతో రాయలసీమ పీఆర్ఐ డివిజన్ ఈఈ ఎం.దయాకర్రెడ్డిని పులివెందుల ఈఈ ఎఫ్ఏసీగా నియమించారు.