వైఎస్‌ రాజారెడ్డి మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ రాజారెడ్డి మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత

May 30 2025 1:35 AM | Updated on May 30 2025 1:35 AM

వైఎస్

వైఎస్‌ రాజారెడ్డి మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత

పులివెందుల : మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత వైఎస్‌ రాజారెడ్డి అని, ఆయన పేద ప్రజలకు ఆత్మీయుడు అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ సతీమణి, పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు. గురువారం దివంగత నాయకుడు వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్సార్‌ సమాధుల తోటలోని వైఎస్‌ రాజారెడ్డి వైఎస్‌ జయమ్మ సమాధుల వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్‌ రాజారెడ్డి కుటుంబంలో చూపిన ప్రేమను, ఆయనను నమ్ముకున్న వారికి అండగా ఉండటంలోనూ, ప్రజల కష్టసుఖాలను పంచుకోవడంలోనూ, అన్నదమ్ముల విషయంలో, అక్కాచెల్లెళ్ల పట్ల బాధ్యతగా ఉండటంలోనూ, ప్రజలపట్ల సేవా తత్పరత కలిగి ఉండటం ఇవన్ని కూడా ఆయనలో ఉన్న సుగుణాలు అన్నారు. రాజారెడ్డి కుటుంబానికి తాము ఐదుగురం కోడళ్లం, అయినా ఏరోజు తమను కోడళ్లుగా చూడలేదని, కన్నబిడ్డల్లాగానే చూసుకున్నారన్నారు. అదేవిధంగా ప్రజలపట్ల కూడా ఆయన సేవాభావంతో ఉండేవారన్నారు. ముఖ్యంగా ఆయన ప్రజలకు సహాయం చేయాలన్న తలంపుతో వారి బిడ్డలలో ఒకరైన వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు, వైఎస్‌ వివేకానందరెడ్డిని పూర్తిగా రాజకీయాల్లో పనిచేసేందుకు స్వాతంత్య్రం ఇచ్చారన్నారు. ఆయన స్ఫూర్తితో జగన్‌ మోహన్‌రెడ్డి అయినా, షర్మిల అయినా, వైఎస్‌ అవినాష్‌రెడ్డి అయినా సేవలు అందిస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డిని సీఎంగా చూడాలని చిరకాల వాంఛ అని అది చూడలేకపోయారన్నారు. కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా రాజారెడ్డి వద్దకు వస్తే ఆ సమస్యను ఆయనే తీరుస్తారనే నమ్మకం ప్రజలలో ఉండేదన్నారు. ఆరోగ్యం కోసం ఆరోజు వైఎస్‌ రాజారెడ్డి ఆసుపత్రిని కట్టి కొడుకును ఇక్కడ పెట్టి ఒక్క రూపాయి వైద్యం అందించారన్నారు. చదువుల కోసం డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల, ఇంటర్మీడియట్‌ కళాశాల పెట్టారన్నారు. అలాగే ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించి ప్రజల హృదయాలలో పెద్దాయనలాగా నిలిచిపోయారని గర్వంగా చెబుతున్నానన్నారు. వైఎస్‌ కుటుంబీకులలో రాజకీయ పునాది వేసిన రథ సారథి ఎవరంటే రాజారెడ్డి అన్నారు. రాజారెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక స్ఫూర్తి అన్నారు. అలాంటి స్ఫూర్తిని మనం కూడా పొందాలని, ఆయన ఆశయాలను గుర్తుకు తెచ్చుకోవాలని, ఆయన పైనుంచి మనందరిని కూడా గర్వపడేలా చూసేలా బతకాలని కోరారు. అలాగే వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా స్థానిక వైఎస్‌ రాజారెడ్డి మోమోరియల్‌ పార్కులో ఉన్న వైఎస్‌ రాజారెడ్డి విగ్రహానికి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్‌ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, వైఎస్సార్‌ సోదరులు సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డి, మైఖేల్‌ బాబు, షర్మిలమ్మ, వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆయన పేద ప్రజలకు ఆత్మీయుడు

వైఎస్‌ కుటుంబం నుంచి ఇద్దరు

ముఖ్యమంత్రులను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది

ఆయన స్ఫూర్తితో వైఎస్సార్‌, వైఎస్‌ వివేకా, జగన్‌, షర్మిల, అవినాష్‌ ప్రజాసేవ

మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ

వైఎస్‌ రాజారెడ్డి మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత1
1/1

వైఎస్‌ రాజారెడ్డి మా కుటుంబానికి స్ఫూర్తి ప్రదాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement