
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కాశినాయన : మండలంలోని జ్యోతిక్షేత్రం సమీపంలోని గరుడాద్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాశినాయన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అప్పటికే గుర్తు పట్టలేని విధంగా ఉంది. పోరుమామిళ్ళ వైద్యాధికారి కరీమ్ ఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
యువకుడి ఆత్మహత్య
కలసపాడు : మండలంలోని ఎగువ తంబళ్లపల్లె గ్రామానికి చెందిన షేక్ ఇమాంసాబ్ కుమారుడు షేక్చాంద్బాషా (24) గురువారం ఉదయం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చాంద్బాషా కలసపాడులో మోటారు మెకానిక్గా పనిచేస్తుండేవాడు. కడుపునొప్పితో ఆరోగ్యం సరిగా లేక రెండు సార్లు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. అయినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. స్థానికులు గమనించి తలుపులు తీయగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భక్తులకు అసౌకర్యం
లేకుండా యోగా కార్యక్రమం
నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీన నిర్వహించే యోగా కార్యక్రమం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులకు సూచించారు. యోగ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం అయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి కలెక్టర్ చామకూరి శ్రీధర్ హాజరవుతారన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని, అందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సౌమ్యనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారి నాగభూషణం, ఎంపీడీఓ రాధాకృష్ణంరాజు, ఈఓఆర్డీ సునీల్కుమార్, డాక్టర్ కార్తీక్విశ్వనాథ్, ఎంఈఓలు అనంతకృష్ణ, నాగయ్య, ఏఓ మల్లికార్జున, ఏపీఓ మురళి, ఏపీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
బైరెటీస్ మిల్లులను ఆదుకోవాలి
ఓబులవారిపల్లె : మంగంపేట ఏపీఎండీసీ గనుల బైరెటీస్ ఖనిజం ఆధారితంగా నిర్మించిన పల్వరైజింగ్ మిల్లులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీఎండీసీ గనుల విస్తరణలో ఇల్లు, భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల వారు అప్పులు చేసి స్థానికంగా చిన్న పరిశ్రమలైన మిల్లులను ఏర్పాటు చేసి అందులో యాభై మందికి జీవనోపాధి కల్పిస్తున్నారన్నారు. దాదాపు 175 మిల్లులు ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎగుమతిదారులకు సీ అండ్ డీ గ్రేడ్ ఖనిజం ధర తగ్గించి ఇవ్వడం మిల్లులకు మరో ధర ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మిల్లులకు రాయితీలతో ఖనిజాన్ని సరఫరా చేసే వారన్నారు. మిల్లులకు రాయితీపై ఖనిజం సరఫరా లేక మిల్లులన్నీ మూతపడి కార్మికులు జీవనోపాధి కోల్పోయారన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం