
నేలకొరిగిన అరటి పంట
కాశినాయన : మండలంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు అరటి తోటలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులు వీచడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బాలాయపల్లె, ఆకులనారాయణపల్లె, వరికుంట్ల, సావిశెట్టిపల్లె, కొండ్రాజుపల్లె, కె.ఎన్.కొట్టాల గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో అరటి పంట గాలులకు నేలకొరిగింది. దాదాపు లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఆకులనారాయణపల్లెలో ఈదురు గాలులకు చెట్లు పడిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఉప్పలూరులో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. వరికుంట్ల గ్రామంలో మార్కారెడ్డి అనే రైతుకు చెందిన మామిడితోట కాయ దశలో ఉంది. ఈదురు గాలులకు కాయలన్నీ నేలరాలాయి. విద్యుత్ అధికారులు విద్యుత్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.