
నేడు ఆలేరు ముసాయిదా ఓటరు జాబితా
సాక్షి, యాదాద్రి : ఆలేరు మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా బుధవారం విడుదల కానుంది. మున్సిపాలిటీలోని 2వ వార్డు సాయిగూడెం గ్రామ పంచాయతీగా మారింది. దీంతో 800కుపైగా ఓట్లు తగ్గాయి. నూతన ముసాయిదా ప్రకారం మొత్తం పన్నెండు వార్డుల్లో 13,526 ఓట్లు మున్సిపాలిటీలో ఉండగా ఆరు వార్డుల్లో గతంలో ఉన్న ఓట్లు తగ్గగా, మరో ఆరు వార్డుల్లో స్వల్పంగా పెరిగాయి. విభజనపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 12 నుంచి 16 వరకు అభ్యంతరాలు పరిశీలించి, 21న వార్డుల విభజనపై తుది నోటిఫికేషన్ జారీ కానుంది.
క్షేత్రపాలకుడికి క్షీరాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతోపాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి.
క్షయ రహిత జిల్లాగా మారుద్దాం
తుర్కపల్లి : జిల్లాను క్షయ వ్యాధి రహితంగా మార్చేందుకు ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. క్షయ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తుర్కపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మొబైల్ టీబీ డయాగ్నోస్టిక్ వాహనం ద్వారా వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో టీబీతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణ చికిత్స, మందులు అందించాలన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిశోభ, డాక్టర్ రుచిరా, సీహెచ్ఓ రాజయ్య, ఎంపీహెచ్ఏ సునిల్కుమార్, పీహెచ్ఎన్ బిస్మిల్లా, ఎంఏ జానిపాష, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
భువనగిరి : జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు పేరు ముందు ఒలింపియాడ్, టెక్నో, జేఈఈ, ఐఐటీ, కోచింగ్, స్పెషల్ క్లాసులు వంటి పదాలను నమోదు చేయకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీఈఓ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కామన్బోర్డు జారీ చేసిన ప్రశ్న పత్రాలు మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులు, ఆటోలు పూర్తిగా ఫిట్నెస్ ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులతోనే బోధన చేయించాలని, ఉపాధ్యాయుల పేర్లు, ఫొటో, వివరాలతో కూడిన పట్టికను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ని బంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థుల భాగస్వామ్యంతో నాణ్యమైన విద్య
నల్లగొండ టూటౌన్ : విద్యార్థుల భాగస్వామ్యంతోనే నాణ్యమైన విద్య అందించడం, సంస్కరణలు అమలు చేయడం సాధ్యమవుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవికాలం సెలవులు జూన్ 1వ తేదీతో ముగిసినందున, విద్యార్థులంతా తిరిగి యూనివర్సిటీలో తరగతులకు హాజరు కావాలని సూచించారు. యూనివర్సిటీలోని నాలుగు కళాశాలల్లో తరగతులు, వసతి గృహాలు ప్రారంభమయ్యాయని వీసీ తెలిపారు.

నేడు ఆలేరు ముసాయిదా ఓటరు జాబితా