
అతిథులకు ఏర్పాట్లలో ప్రభుత్వం వైఫల్యం
● కూలిన బొత్స కూర్చున్న వేదిక
● ఎమ్మెల్సీ సురేష్బాబు, తదితరులకు గాయాలు
సాక్షిప్రతినిధి, విజయనగరం:
పైడితల్లి సిరిమాను ఊరేగింపు సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులను అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆఖరుకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ, పార్టీ ఇతర నాయకులూ సిరిమాను చూసేందుకు ఏర్పాటు చేసిన వేదికను కూడా సరిగా వేయలేదు. వేదిక కూలిపోవడంతో బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు సహా వైఎస్సార్ సీపీ నాయకులకు ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో వారంతా కింద పడిపోయారు. ఈ ఘటనతో సిరిమానోత్సవంలో గందరగోళం నెలకొంది. బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ సురేష్ బాబు, మాజీ ఎంపీలు బొత్స ఝాన్సీ, బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ కూడా కిందపడిపోయారు. ఎమ్మెల్సీ సురేష్ బాబు కు స్వల్పగాయాలయ్యాయి. వాస్తవానికి దశాబ్దాలుగా బొత్స సత్యనారాయణ, ఇతర నాయకులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ప్రాంగణంలో కూర్చుని సిరిమానును తిలకించేవారు. అయితే ఈసారి డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఆ ప్రాంగణం తమదని, దాన్ని బొత్స సత్యనారాయణకు ఇచ్చేది లేదని అన్నారు. దీంతో ప్రభుత్వం అదే రోడ్డులో ఒకనాటి విజయనగరం అర్బన్ బ్యాంక్ భవనం ఉన్న ప్రాంగణంలో టెంట్లు వేసి నాసిరకంగా వేదిక ఏర్పాటు చేశారు. వేదికను నామ్ కె వాస్తేగా వేశారే తప్ప అవి ఏమంత పటిష్టంగా లేవు. దీనికితోడు అక్కడి మట్టిని కూడా ఏమాత్రం లెవెలింగ్ చేయకపోవడం... నేల కాస్త సరిగా ఉందా లేదా అనేది కూడా చూసుకోకుండా మామూలుగా ఓ పందిరి మాదిరివేసేసి ఊరుకున్నారు. సిరిమాను చూసేందుకు బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, సురేష్ బాబు, బెల్లాన చంద్రశేఖర్, ఝాన్సీ తదితరులు స్టేజి మీదకు ఎక్కి కాసేపు కూర్చున్నారు. అంతలోనే వేదిక ఆలా కుప్పకూలిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా కింద పడిపోయారు.. ఈ ఘటనలో ఎమ్మెల్సీ సురేష్బాబుకు స్వల్పగాయాలయ్యాయి. ప్రభుత్వ పర్యవేక్షణ,. బాధ్యతా రాహిత్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
బొత్స వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడికి, పైగా శాసన మండలిలో ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా, ఇచ్చకానికి ఇచ్చినట్లు నాలుగు బల్లలు వేసి అదే వేదిక అని చెప్పి అక్కడే కూర్చుని సిరిమానును చూడాలని చెప్పడం ఆయనను అవమానించడమే అని అంటున్నారు. ఈ తప్పిదానికి ప్రభుత్వానిదే బాధ్యత అని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
దర్శన సమయంలోనూ అవమానించే ధోరణిలో..
ఉదయం రాజకీయ ప్రముఖులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. అందరినీ నేరుగా పంపించిన ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యన్నారాయణకు దర్శనం కల్పించడంలో కూడా వివక్ష చూపారు. దర్శనానికి వచ్చిన ఆయనను ఆపి ఇలా కాదు.. అలాగ వెళ్లండంటూ మాట్లాడారు. దీనిపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన చూసిన వారందరూ ప్రభుత్వం, అధికారయంత్రాంగం తీరును తప్పుబట్టారు.

అతిథులకు ఏర్పాట్లలో ప్రభుత్వం వైఫల్యం