
ఐపీఎల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలి
విజయనగరం: ఐపీఎల్ స్థాయిలో ఆడేవిధంగా జిల్లాలోని క్రీడాకారులు తయారు కావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్, రాష్ట్ర స్థాయిలో ఆడి,విజేతలుగా నిలిచిన క్రీడాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి మైదానం, క్రీడా సౌకర్యాలను వినియోగించుకుని మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులుగా తయారుకావాలని పిలుపునిచ్చారు. ఐపీఎల్లో మన జిల్లా క్రీడాకారులు ఆడాలని, తన కోరిక నెరవేర్చాలని పిలుపునిచ్చారు. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. క్రీడా మైదానాలు చిల్లర కొట్టు మాదిరిగా తయారయ్యాయని అసహనం వ్యక్తం చేశారు. ఉన్న క్రీడా సౌకర్యాలను వినియోగించుకుని మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ చరిత్ర కలిగిన మైదానం విజ్జి క్రీడా మైదానం పేరు నిలబెట్టే విధంగా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రాంబాబు, మాజీ క్రీడాకారులు, అసోసియేషన్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్