
అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు
స్వామి సేవలో తరించిన తమిళనాడు భక్తులు
125 నిత్య కల్యాణాలు,
125 స్వర్ణపుష్పార్చనలు
108 స్వర్ణ సంపెంగలతో
అష్టోత్తరశతనామావళి
138 మంది ఉభయదాతల భాగస్వామ్యం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం రికార్డు స్థాయిలో నిత్యకల్యాణాలు, స్వర్ణపుష్పార్చన సేవలు వైభవంగా జరిగాయి. చైన్నెకి చెందిన కించిత్కారం ధర్మ సంస్థాపనమ్ ఆధ్వర్యంలో ఏకంగా 125 నిత్యకల్యాణాలు, 125 స్వర్ణ పుష్పార్చనలు నిర్వహించారు. తమిళనాడు నుంచి వచ్చిన ఆ సంస్థకు చెందిన 125 మంది ఉభయదాతలు ఈ సేవల్లో పాల్గొన్నారు. వీరికి అదనంగా మరో 13 మంది ఉభయదాతలు కూడా నిత్యకల్యాణంలో పాల్గొనడంతో.. మొత్తం 138 నిత్య కల్యాణాలు జరిగాయి. ఉభయదాతలతో ఆలయ కల్యాణ మండపం కిక్కిరిసిపోయింది. తొలుత ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయదాతలను కల్యాణ మండపంలో కూర్చోబెట్టారు. స్వామి వారి ఉత్సవమూర్తులను శేషతల్పంపై అధిష్టింపజేసి.. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తరశతనామావళి సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతి అందించారు. ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో ఈ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. అలాగే సాయంత్రం గరుడసేవ నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. సింహగిరి మాడ వీధిలో స్వామికి పెద్ద ఎత్తున తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు పర్యవేక్షించారు. కించిత్కారం ధర్మ సంస్థాపనమ్ నిర్వాహకులు యు.వి.కృష్ణన్ స్వామి సేవల్లో పాల్గొన్నారు.

అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు

అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు

అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు