
విద్యుత్ ఉద్యమంపై కూటమి కుట్ర
ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెడుతున్న ప్రభుత్వం
తెలుగు నాడు సంఘం పేరుతో
ఉద్యమ కార్యాచరణ విచ్ఛిన్నం
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం
అన్ని సంఘాలు నిరసనలు
‘తెలుగునాడు’ సంఘం మాత్రం తాము పాల్గొనడం లేదంటూ ప్రకటన
జేఏసీ ఉద్యమ కార్యాచరణకు
మోకాలడ్డేందుకు ప్రభుత్వం కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ కాంట్రాక్ట్, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రధాన డిమాండ్తో దశలవారీగా సమ్మె నిర్వహిస్తున్న జేఏసీ కార్యచరణ పై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సంఘాల మధ్య చిచ్చుపెట్టేలా తమ అనుబంధ అసోసియేషన్ తెలుగునాడు ని పావుగా వినియోగించుకుంటోంది. గత నెల చివరివారం నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న చీమకుట్టినట్టైనా స్పందించని ప్రభుత్వం ఇప్పుడు జేఏసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు అడ్డగోలు చర్యలకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా అక్టోబర్ 15 నుంచి తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.
విద్యుత్ రంగములో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల, ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్స్ ను పరిష్కరించుకుంటే అక్టోబర్ 15 వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్తామని ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ మరోసారి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. సోమవారం ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు అన్ని ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చుపెట్టి ఉద్యమాన్ని అణిచివేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పొందుతుంది. టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ని అడ్డం పెట్టుకొని ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఎత్తుగడలు వేస్తోంది. డిస్కౌంట్ లో పనిచేస్తున్న దాదాపు అందరూ ఉద్యోగులు కార్మికుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం జేఏసీ ఉద్యమ కార్యచరణ చేపడుతుంటే తాము మాత్రం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంటామంటూ ఉద్యమంలో పాల్గొంటూ తెలుగు నాడు సంఘం ప్రకటన చేయడం వెనక ప్రభుత్వం ఉందనేది స్పష్టమవుతుంది. అనుబంధ సంస్థ వైఖరి బట్టి కూటమి ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి పూర్తి వ్యతిరేకమని మరోసారి బట్టబయలైంది. పలుమార్లు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం వల్లే దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జేఏసీ నేతలు పునరుద్ధాటించారు. ప్రభుత్వ అనుబంధ ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా డిమాండ్లు నెరవేరేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 14న వర్క్ టు రూల్ పాటిస్తామని ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో సుమారు 27 వేల మంది కాంట్రాక్టు కార్మికులు చాల తక్కువ వేతనాలకు పనిచేస్తున్నరనీ వారిని పెర్మనెంట్ చేయాలనీ డిమాండ్ చేస్తుంటే... తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం చూస్తే ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చేందుకు నెట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేటట్లుగా కనిపించడం లేదని సుస్పష్టమౌతోంది. ఎన్నికల సమయాల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విద్యుత్ కార్మికులను విస్మరించడం తగదని జేఏసీ చెబుతోంది. విద్యుత్ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ డిమాండ్లేవీ పరిష్కరించకుండా ఉద్యమాన్ని నీరుగారిచేందుకు ప్రభుత్వం శాయశక్తుల కుయుక్తులు పన్నుతూ ఆందోళన కార్యక్రమాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినా.. వాటిని తిప్పికొట్టేందుకు జేఏసీ దూకుడుగా వ్యవహరిస్తోంది.