
‘వెన్నుపోటు దినం’ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజలను మోసగించిన తీరును ఎండగడుతూ బుధవారం జరిగే ‘వెన్ను పోటు దినం’కార్యక్రమానికి విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, ఎమ్మెల్యే వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె.కె.రాజు, వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నా.. కూటమి ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఏడాది పాలనలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదని.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ప్రజలకు చెప్పే బాధ్యతను మహిళలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు మహిళా నేతలు పాల్గొన్నారు.