
సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి
వృద్ధురాలి మెడలో మంగళసూత్రం అపహరణ
ఇబ్రహీంపట్నం: కూరగాయల కోసమొచ్చిన వృద్ధురాలి మెడలోని బంగారు మంగళసూత్రాన్ని ఓ దుండగుడు అపహరించుకొని పరారైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(65) ఇబ్రహీంపట్నంలోని మార్కెట్కు ఆదివారం ఉదయం వచ్చింది. అక్కడ కూరగాయలు తీసుకొని తలపై పెట్టుకొని వెళుతుంది. ముఖానికి మంకి క్యాప్ ధరించిన దుండగుడు నడుచుకుంటూ వచ్చి ఆమె తలపై సంచిని కిందపడేసి మెడలోని నాలుగు తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. దీంతో వృద్ధురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. స్థానిక ఏసీపీ కేపీవీ రాజు, సీఐ జగదీశ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
మహిళ అదృశ్యం
యాచారం: కూలీ పనికంటూ ఇంటి నుంచి వెళ్లిన మహిళ తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన దండుగుల శేఖర్ భార్య మమత(29) గత నెల 30న ఉదయం 7 గంటలకు కూలీకి పోతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులైనా తిరిగి రాకపోవడం, ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉంది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లోని బంధువుల ఇళ్లల్లో వెతికినా జాడ లేదు. ఆదివారం మమత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు.
బైక్ను ఢీకొన్న ట్రాక్టర్
ఒకరి దుర్మరణం
ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆమనగల్లు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. ముర్తుజపల్లి గేటు వద్ద హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైక్ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన రాయకుంట కృష్ణయ్య(35), ఆయన బంధువు శేఖర్ పని నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై సొంతూరికి బయలుదేరారు. మార్గమధ్యలో పట్టణ సమీపంలోని ముర్తుజపల్లి గేటు వద్ద అతివేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందగా, శేఖర్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చెరువులో మునిగిన యువతి!
ఇబ్రహీంపట్నం: చెరువులోకి దిగిన యువతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నగరంలోని ఫలక్నుమాకు చెందిన రేష్మా(24) బాలపూర్కు చెందిన ఆమె స్నేహితుడు ఖాసీంతో కలిసి ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు ఆటోలో వచ్చినట్లు తెలిసింది. ఖాసీం ఈత కొడుతుండగా రేష్మా కూడా చెరువులోకి దిగినట్లు సమాచారం. ఏమైయిందో ఏమోగాని ఆకస్మాత్తుగా యువతి చెరువు నీటిలో మునిగిపోయింది. చీకటి పడటంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టలేదు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాల పేరుతో టోకరా
నిందితుడి అరెస్టు
రాంగోపాల్పేట్: కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ సుధీంద్ర కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లి బాపూజీనగర్కు చెందిన శ్రవణ్కుమార్ అమాయకులను ఎంచుకుని కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. 2009 నుంచి 2024 వరకు బేగంపేట, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీలేఖ అనే మహిళ నుంచి రూ.22వేలు తీసుకుని ఫుడ్ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు. పవన్ అనే వ్యక్తి నుంచి రూ.35వేలు, విశాల్ అనే వ్యక్తి నుంచి రూ.20వేలు, మరో వ్యక్తి నుంచి రూ.35వేలు, వేములవాడకు చెందిన కృష్ణ అనే వ్యక్తి నుంచి రూ.50వేలు తీసుకుని కంటోన్మెంట్ బోర్డులో ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు డిఫెన్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అత డిని ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి తిరుమలగిరి పోలీసులు అప్పగించారు.

సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి

సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి