
ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పిస్తాం
● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి
● నేడు తాండూరులో మెగా ఉద్యోగమేళా
తాండూరు: నియోజకవర్గంలో ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పనకు మెగా ఉద్యోగమేళాను గురువారం నిర్వహిస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో మెగా ఉద్యోగమేళా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న తాండూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా 54 కంపెనీలను సంప్రదించి మెగా ఉద్యోగమేళాతో 11 వేల ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవ చ్చని అన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రభు త్వం ఈజీఎంఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం పాల్గొంటుందన్నారు. తాండూరులో నిర్వహించే మెగా ఉద్యోగ మేళాను ఆదర్శంగా చేసుకొని జిల్లాలోని కొడంగల్, వికారాబాద్లలో ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ సిద్ధమవుతున్నారన్నారు. మేళాలో ఉద్యోగాలు వచ్చిన వారికి నెల రోజుల పాటు వసతి, భోజన సౌకర్యాలు ఉచితంగా అందిస్తారన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, పార్టీ బీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్చంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, నాయకులు నర్సింహులు, లొంక నర్సింహులు, జుబేర్లాల, ప్రభాకర్గౌడ్, రామ కృష్ణ, ప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.