
3,022 క్వింటాళ్ల జొన్నల కొనుగోలు
మోమిన్పేట: మోమిన్పేట పీఏసీఎస్ ఆధ్వర్యంలోని 3,022 క్వింటాళ్ల జొన్నల కొనుగోలు చేశామని, ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో కోటి రూపాయలు జమ చేశామని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ నాగార్జున తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు జొన్నలు కొనుగోలు చేసిందన్నారు. ఇప్పటి వరకు 170 మంది రైతుల నుంచి 3,022 క్వింటాళ్ల కొనుగోలు చేశామన్నారు. సేకరించిన జొన్నలను తాండురులోని డీసీఎంఎస్ గోదాంకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు దళారులకు పంట దిగుబడి విక్రయించి మోసపోరాదని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు. రైతులకు సహకార సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లు వివరించారు. పంట రుణాలు, ధీర్ఘకాలిక రుణాలు, బంగారు నగలపై రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 750 మంది రైతులు సంఘంగా ఏర్పడి ఒక్కొక్కరు రూ.2 వేల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూ.15లక్షలు అవుతుందని.. బ్యాంక్ తన వాటాగా మరో రూ.15 లక్షలు వారి పేరిట డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు. ఈ డబ్బుతో సంఘం సభ్యులు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చని సూచించారు. పీఏసీఎస్లో ఉన్న వాటా మూలధనంపై డెవిడెంట్లు ఇవ్వాలని చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి డీసీఓను కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి, సీఈఓ శేఖర్, జిల్లా సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో రూ.కోటి జమ చేశాం
డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ నాగార్జున