
గోవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
తాండూరు టౌన్: అక్రమంగా ఆవులను, లేగ దూడలను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 7వ తేదీన బక్రీద్ ఉన్నందునా ఆవులు, లేగ దూడలు కాకుండా ఇతర పశువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రశీదులను కొనుగోలుదారులు తప్పకుండా కలిగి ఉండాలని పేర్కొన్నారు. పశువులను విక్రయించే సమయంలో వెటర్నరీ వైద్యుడు లేదా పంచాయతీ కార్యదర్శి నుంచి విక్రయదారులు అనుమతి తీసుకోవాని సూచించారు. గోరక్షక్ సేవా సమితి లేదా ఇతరులకు ఆవులను తరలిస్తున్నట్లు తెలిస్తే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం చేరవేయాలన్నారు.
యాలాల: గోవులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్ఐ గిరి హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. ప్రధాన మార్గంలో వెళ్లే గూడ్స్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాల పత్రాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు. గోవుల అక్రమ రవాణా నిరోధానికి చెక్పోస్టు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎవరైనా గోవులను రవాణా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.