
మోటార్ల దొంగలు అరెస్ట్
ఏర్పేడు:విద్యుత్ మోటారు స్టార్టర్లు, వైర్లను దొంగలిస్తున్న ముఠాను సోమవారం ఏర్పేడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు రేణిగుంట డీఎస్పీ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఎస్పీ విష్ణువర్ధన్ రాజు ఆదేశాలతో నిందితులను పట్టుకునేందు కు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఏర్పేడు మండంలో ఆరు కేసులు, రేణిగుంట, గాజులమండ్యం, శ్రీకాళహస్తి రూరల్ మండలాల్లోని కేసులకు సంబంధించి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. సాంకేతిక సహాయంతో దొంగతనాలు జరుగుతున్న తీరుపై ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి, గాజులమండ్యం సీఐ మంజునాఽథ్రెడ్డి, ఏర్పేడు ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, ఏఎస్ఐ ధర్మసింగ్, సిబ్బందితో కలసి సమగ్ర దర్యాప్తు చేసినట్లు వివరించారు. సోమవారం వికృతమాల టీసీఎల్ కంపెనీ సమీపంలో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి 40 ట్రాన్స్ఫార్మర్ల రాగి వైరు, 77 స్టార్టర్ల రాగి వైరు మొత్తం 795 కిలోల రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన నిందితులలో శ్రీకాళహస్తి మండలం, ఎర్రగుడిపాడుకు చెందిన కె.వెంకట్రామయ్య(45), శ్రీకాళహస్తికి చెందిన కత్తి మణి(35), ఎర్రగుడిపాడుకు చెందిన జెండా వెంకటేష్ అలియాస్ చిరంజీవి(45) ఉన్నట్టు తెలిపారు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరి నుంచి ఈ స్క్రాబ్ను తిరుపతికి చెందిన ఖాదర్బాషా, సయ్యద్వాజిద్ హుస్సేన్, షేక్ బషీద్, శ్రీకాళహస్తికి చెందిన షేక్ హుస్మాన్, వెంకటగిరికి చెందిన సత్నా గోపాలకృష్ణ తక్కువ ధరకు కొనుగోలు చేశారని, చోరీ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేయడంతో వీరి ఐదుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. నిందితులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశామన్నారు.