
ఆధ్యాత్మిక నగరంలో అలవిగాని హామీలు
● ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రగల్భాలు ● అర్చకులకు నెలకు రూ.15 వేలు వేతనం అంటూ ప్రచారం ● 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీకి పింఛన్ ఇస్తామని ప్రకటన ● ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు ● స్వరం కలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ● ఏడాది గడుస్తున్నా హామీల జోలికెళ్లని అధినేతలు ● అధికారం కోసం నమ్మించి మోసం చేశారంటున్న జిల్లా ప్రజలు
శ్రీవేంకటేశ్వర స్వామి సాక్షిగా!
● ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదే
● డబుల్ ఇంజిన్ సర్కార్తో సంక్షేమ పథకాలను మరింత పరుగులు పెట్టిస్తా
● తిరుమల పవిత్రతను కాపాడుతా
● 50 వేలకుపైగా వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలలో పనిచేసే అర్చకులకు రూ.15వేలు వేతనం అందిస్తా
● అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల అర్చకులకు రూ.5వేల నుంచి రూ.10 వేలు అందిస్తా
● పోటు వృత్తిని కుల వృత్తిగా పరిగణించి గుర్తిస్తాం
● బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ సొసైటీని బలోపేతం చేస్తాం
● 50 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికీ పింఛన్ అందింస్తాం.
● షరతులు లేకుండా ప్రతి పేదవారికి పింఛన్లు పంపిణీ చేస్తాం
తిరుపతి తుడా : అధికారం కోసం అడ్డదారులు తొక్కడం..అమలు కాని హామీలతో వంచించడం.. మాయమాటలు చెప్పి నమ్మించడం.. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలకు విస్మరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ‘నేను మారాను.. నన్ను నమ్మండి’ అంటూ మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు మరోసారి ప్రజలను నిలువునా ముంచేశారు. ఏడాది గడుస్తున్నా ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయకపోవడంతో జిల్లా ప్రజలు రగిలిపోతున్నారు.
ఊరూరా నమ్మించి..వంచించి!
అధికారమే పరమావధిగా భావించే చంద్రబాబు మారిన మనిషిలా నటించారు. తనతోక పార్టీ అధినేతతో కలసి జిల్లాలో ఊరు వాడా తిరిగి సామాన్య, బడుగు బలహీన వర్గాలను టార్గెట్ చేసుకుని నమ్మించేశారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు తొలి సంతకం హామీని అభాసుపాలు చేశారు. అంతటితో ఆగకుండా మరోసారి శ్రీవేంకటేశ్వర స్వామిని సాక్షిగా అంటూ రాష్ట్రంలోని దేవాలయ ట్రస్ట్బోర్డు నియామకాలలో బ్రాహ్మణులకు చోటు కల్పిస్తానని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
పింఛన్లు తుంచి..అభాగ్యులను ముంచి
అధికారంలోకి వస్తే పెంచిన పింఛన్ను అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా 12 నెలల కాలంలో ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో జిల్లా వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం 15 వేల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2024 మే నెలకు 2,71,183 అందిచగా.. కూటమి ప్రభుత్వ హయాంలో 2025 జూన్ నెల వాటిని 2,60,379 తగ్గించేశారు.
ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
చంద్రబాబు సత్యవేడు ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. కనీసం ఆ ప్రస్తావన ఎత్తకపోవడం దారుణం. ఏడాది పాలన పూర్తవుతున్నా సత్యవేడు ప్రజలకు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. 100 పడకల ఆస్పత్రి మాటేలేదు. మున్సిపాలిటీగా గుర్తిస్తామన్నారు. ఆ ప్రస్తవన ఎత్తడం లేదు. బైపాస్రోడ్డు, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుపై స్పందించే నాయకుడేలేడు.
– శివయాదవ్, వరదయ్యపాళెం మండలం
మాటిచ్చి నెరవేర్చకపోతే ఎలా?
ఎన్నికల సమయంలో చంద్రబాబు పుట్టిన రోజు గూడూరుకు విచ్చేశారు. అప్పడు ఎన్నికల సభలో పలు హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే వాటన్నింటినీ అమలు చేస్తామన్నారు. కానీ ఏడాది పూర్తవుతున్నా హామీల జోలికి వెళ్లడం లేదు. పేదలు నరకయాతన అనుభవిస్తున్నారు. – కోట్లపూడి శ్రీనివాసులు,
కాశీపురం, వాకాడు మండలం
ఈవీ ఆటోలు.. ఎక్కడ లోకేశం!
యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతి అంకుర ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన సభలో తన తండ్రికి మించి నారా లోకేష్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నగరంలో అత్యధికంగా ఆటోలు ఉండడాన్ని గుర్తించిన లోకేష్ అండ్ కో వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆటో డ్రైవర్లా ఖాకీ చొక్కా ధరించి వారికి పెద్ద దిక్కుగా ఉంటానని మాయ మాటలు చెప్పారు. డీజిల్ ఆటోలు నడపడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుందని, యూరప్ దేశాల తరహాలో తిరుపతిలోనూ ఎలక్ట్రికల్ చార్జింగ్ ఆటోలను నడపాలని సూచించారు. అధికారంలోకి వచ్చాకా ఆటోవాలాలందరికీ సబ్సిడీపై ఈవీ ఆటోలు కొనిచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని నమ్మించారు.ఆధునిక హంగులతో ఆటో స్టాండు, చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీలకు ఏడాది కావస్తున్నా ఆ ఊసే ఎత్తకపోవడంపై ఆటోవాలాలు విమర్శలు గుప్పిస్తున్నారు. పేదలందరికీ రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానంటూ నమ్మించి వంచిచడంపై రగిలిపోతున్నారు.
దగా చేయడం పవ నిజమా?
చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఊగిపోతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు మించిన నాయకుడు లేడంటూ మద్దత్తు పలికారు. ఈ క్రమంలో తిరుపతి పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు స్వరం కలిపారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయాంలో అమరరాజ ఫ్యాక్టరీని తిరుపతి నుంచి తరిమేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరరాజా ఫ్యాక్టరీని తిరిగి రప్పిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. ఏడాది కావస్తున్నా తెలంగాణలో స్థాపించిన అమరరాజాను అక్కడ ఖాళీ చేయించి తిరుపతికి రప్పించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

ఆధ్యాత్మిక నగరంలో అలవిగాని హామీలు

ఆధ్యాత్మిక నగరంలో అలవిగాని హామీలు

ఆధ్యాత్మిక నగరంలో అలవిగాని హామీలు