
మృత్యుంజయ స్వామికి ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, కలశ స్థాపన చేశారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ్ల, పసుపు, కుంకుమ, విభూధి వంటి వాటితో అభిషేకాలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 78, 031 మంది స్వామివారిని దర్శించుకోగా 32,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.46 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించరని టీటీడీ విజ్ఞప్తి స్పష్టం చేసింది.
ఆగమ సలహాదారుగా
వేదిక్ ఆచార్యులు
తిరుపతి సిటీ: టీటీడీ వైఖాసన ఆగమ సలహాదారులుగా ఎస్వీ వేదిక్ వర్సిటీ వైఖాసన విభాగ సహాయ ఆచార్యులు డీఆర్ పరాశరం భావనారాయణ నియమితులయ్యారు. వర్సిటీలో సోమవారం రిజిస్ట్రార్ డాక్టర్ పి.భాస్కరుడు ఆయన్ను అభినందించారు.
వేదిక్లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ (శాస్త్రి), ఎంఏ (ఆచార్య), పీహెచ్డీ, సర్టిఫికెట్, డిప్లొమో కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు అర్హత, దరఖాస్తు వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడాలని సూచించారు. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.

మృత్యుంజయ స్వామికి ప్రత్యేక పూజలు