
చెరువు మట్టి..కొల్లగొట్టి
దళవాయి చెరువులో చెలరేగుతున్న మట్టి మాఫియా
● హైవే విస్తరణ పనుల ముసుగులో దోపిడీ ● ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి ● అధికారమే అండగా బరితెగించిన ఓ బడా నాయకుడు ● ఆందోళనలకు సిద్ధమవుతున్న ఆయకట్టు రైతులు
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, పెరుమాళ్లపల్లి సమీపంలోని దళవాయి చెరువులో నుంచి రెండు నెలలుగా మట్టిని తరలిస్తున్నారు. రోజుకు పది టిప్పర్ల చొప్పున ఒక్కో టిప్పర్ పది ట్రిప్పుల వంతున వంద ట్రిప్పుల మట్టిని కొల్లగొడుతున్నారు. హైవే రోడ్డు విస్తరణ పనుల ముసుగులో ఎర్రమట్టిని గుట్టుగా తరలించి కోట్లు సంపాదిస్తున్నారు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
టిప్పరు ఎర్రమట్టి రూ.10 వేలు
చెరువులో మట్టి ఇటుకల తయారీకి అనుకూలంగా ఉంటోంది. చుటు పక్కల ప్రాంతాలలో తయారుచేసే ఇటుక బట్టీలకు చెరువులోని మట్టిని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఒక్కో ట్రిప్పు మట్టి విలువ సుమారు రూ.10 వేలు.. ఆ లెక్కన రోజూ 100 ట్రిప్పుల మట్టి విలువ దాదాపు రూ.10 లక్షలు. అంటే రోజుకు రూ.10లక్షలు లెక్కన నెలకు రూ.3 కోట్ల పైచిలుకు మట్టి వ్యాపారం జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ రెండు నెలల కాలంలో మట్టి అక్రమార్కులు దాదాపు రూ.6 కోట్ల విలువైన మట్టిని తవ్వేసినట్టు సమాచారం.
బరితెంగించిన బడా నాయకుడు
హైవే విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఓ రాజకీయ పార్టీలో నియోజకవర్గ స్థాయి నాయకునిగా చెలామని అవుతున్నారు. ఆ బడా నాయకుడు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సమీప గ్రామాల ప్రజల విన్నపాలను లెక్క చేయకుండా అధికారులను బెదిరిస్తూ యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వేస్తున్నట్టు సమాచారం. హైవే అథారిటీ నుంచి నీటి పారుదల శాఖ, మైనింగ్ శాఖ అధికారులకు మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలన్న రిక్వెస్ట్ లెటర్ చేతబట్టుకుని అడ్డగోలు గా తవ్వకాలు సాగించేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీలో ఉన్న ఆ నాయకుని జోలి కి వెళ్లడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఇదే అదునుగా దళవాయి చెరువును రాత్రి, పగలు తేడా లేకుండా కొల్లగొడుతున్నారు. ఇలాగే మట్టి రవాణా చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆ చెరువు ఆయకట్టుదారులు, సమీప గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.
మట్టి అక్రమ తవ్వకాలకు చెరువులో భారీ యంత్రాలు
మామూళ్ల మత్తులో అధికారులు
హైవే విస్తరణ పనులకు చెరువులలో మట్టి తరలింపు చేయాలంటే ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాలి. మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చే ముందు సంబంధిత నీటి పారుదల శాఖ నుంచి నిరభ్యంతర లేఖను తీసుకుని, ఆపై ప్రభుత్వ నిబంధనల మేరకు డబ్బులు చెల్లించుకుని సదరు కాంట్రాక్టర్కు నిర్దేశించిన ప్రదేశంలో నిర్ణయించిన లోతు మేరకు మట్టిని తవ్వుకునే అనుమతులు పొందాల్సి. కానీ దళవాయి చెరువులో ఇవేవీ అమలు కావడం లేదు. ఎలాంటి అనుమతులు లేకపోగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి అక్రమ రవాణాకు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు మైనింగ్ అధికారులు సైతం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆయకట్టు దారులు ఆరోపిస్తున్నారు. మట్టి వ్యాపారులు అందించే మామూళ్లకు కక్కుర్తి పడి అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళవాయి చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను స్థానికంగా నివాసముంటున్న ఓ అధికారి దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లగా ‘మట్టి అక్రమ రవాణాను తాను కూడా గమనిస్తున్నానని, అయినా ఏమీ చేయలేక పోతున్నాం’ అంటూ చేతులెత్తేయడం గమనార్హం. ఇరిగేషన్ ఏఈఈ రవిశంఖర్ను వివరణ కోరగా అక్కడ మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, మట్టి తరలింపును నిలిపివేశామని చెప్పారు. గత రెండు నెలలుగా 30 అడుగుల లోతు తవ్వేసినందుకు వారిపై ఏరకమైన చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆ అధికారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

చెరువు మట్టి..కొల్లగొట్టి