
ఉపాధ్యాయ ఖాళీలు
పదోన్నతులు పొందినప్పటికీ..
676
చిలుకూరు: వివిధ దశల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తికావడంతో జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది. ఇదే క్రమంలో పలుచోట్ల ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది. జిల్లాలో ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్ఎంలుగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. ఈ ప్రక్రియతో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరింది.కానీ ప్రాథమిక పాఠశాలలను మాత్రం టీచర్ల కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 676 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అత్యధికంగా ఎస్జీటీ పోస్టులు ఖాళీ
ఉపాధ్యాయుల ప్రదోన్నతుల ప్రక్రియ ముగియడంతో ఎక్కడెక్కడ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వివరాల సేకరణకు జిల్లా విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఏడాది వ్యవధిలో రెండుసార్లు పదోన్నతులు చేపట్టడంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తారని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ముగిసిన పదోన్నతుల ప్రక్రియ అనంతరం జిల్లాలో 676 ఖాళీలు ఉన్నట్లు తేలింది. ఇందులో అత్యధికంగా ఎస్జీటీ, అత్యల్పంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
జిల్లాలో 950 పాఠశాలలు
జిల్లా విద్యాశాఖ పరిధిలో మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు 950 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 4,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా ప్రస్తుతం 3,710 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 676 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా ఎస్జీటీ పోస్టుల ఖాళీలు ఏర్పడడంతో డీఎడ్ అభ్యర్థులకు కలిసిరానుంది. స్కూల్ అసిసెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ 70 శాతం పదోన్నతులకు వదిలివేయాల్సి ఉంటుంది. మిగిలిన 30 శాతం మాత్రమే ఆ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ సమయానికి పదవీ విరమణ ఖాళీలను బట్టి మరిన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది.
ఫ పదోన్నతుల ప్రక్రియ
పూర్తితో తేలిన లెక్క
ఫ హైస్కూళ్లలో తీరిన
ఉపాధ్యాయుల కొరత
ఫ ప్రాథమిక పాఠశాలల్లో
ఏర్పడిన ఖాళీలు
ఫ ప్రస్తుతం పనిచేస్తున్నది 3,710 మంది
ఫ ఉద్యోగోన్నతి పొందినవారి సంఖ్య 139
జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు పదోన్నతులు పొందినప్పటికీ కొంత మందికి కేటాయించిన పాఠశాలలకు వెళ్లలేదు. జీహెచ్ఎంలుగా 23 మంది పదోన్నతి పొందగా 20 మంది జాయిన్ కాగా ముగ్గురు జాయిన్ కాలేదు. అలాగే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా 28 మందికి పదోన్నతి రాగా 16 మంది జాయిన్ అయ్యారు. 8 మంది జాయిన్ కాలేదు. స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతిలో ఇంగ్లిష్ సబ్జెక్టులో 14 మందికి 12 మంది జాయిన్ అయ్యారు. గణితంలో 13 మందికి 11 మంది జాయిన్ అయ్యారు. భౌతికశాస్త్రంలో ఆరుగురికి నలుగురు జాయిన్ అయ్యారు. జీవశాస్త్రం సబ్జెక్టులో 18 మందికి 15 మంది జాయిన్ అయ్యారు. సోషల్ సబ్జెక్టులో 31 మందికి 18 మంది జాయిన్ అయ్యారు. ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)లో ఆరుగురికి ఆరుగురు జాయిన్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 139 మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందగా వారిలో కేవలం 102 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వారు పలు కారణాల దృష్ట్యా విధుల్లో చేరలేదు.