
మూసీకి పోటెత్తిన వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు శనివారం వరద పోటెత్తింది. సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్లోకి 41,324 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో 643.70 అడుగుల వద్ద నీరు ఉంది. మూసీకి ఇన్ఫ్లో భారీగా వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 8క్రస్ట్ గేట్లను ఎనిమిది అడుగులు, ఒక గేటును ఆరు అడుగులు (మొత్తం 9గేట్లు) పైకెత్తి 44,547 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కుడి, ఎడమ కాల్వలకు 190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లను ఎత్తడంతో కేతేపల్లి మండలం భీమారం శివారులో మూసీవాగుపై నిర్మించిన లోలెవల్ వంతెన వరదనీటిలో మునిగిపోయింది. మిర్యాలగూడ వయా భీమారం మీదుగా సూర్యాపేటకు వాహనాల రాకపోకలు నిలిపేసి ఉప్పలపహాడ్, కొప్పోలు గ్రామాల మీదుగా దారి మళ్లించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం ఆయన సూ ర్యాపేట మండలం ఎదురువారిగూడెం–భీమారం వంతెన వద్ద మూసీ ప్రవాహాన్ని పరిశీలించి మాట్లాడారు. అత్యవసరమైతే డయల్ 100, స్పెషల్బ్రాంచ్ కంట్రోల్రూమ్ నంబర్ 8712686026 ఫోన్ చేసి పోలీస్ సేవలు పొందాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రామారావు, రూరల్ ఎస్ఐ బాలునాయక్ ఉన్నారు.
ఫ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తివేత