
వేలిముద్రల విధానం విరమించుకోవాలి
అర్వపల్లి: యూరియా పంపిణీకి సంబంధించి ఇ–పాస్ యంత్రం ద్వారా రైతుల వేలిముద్రలు తీసుకోవడంతో గంటల కొద్దీ సమయం తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు శనివారం అర్వపల్లిలోని పీఏసీఎస్ ఎదుట సూర్యాపేట–జనగామ హైవేపై గంటన్నర పాటు రాస్తారోకో చేశారు. తెల్లవారుజాము నుంచి సుమారు 800మందికి పైగానే రైతులు పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం వేచి ఉన్నారు. సాయంత్రం వరకు కూడా 300మంది రైతులకు మాత్రమే యూరియా అందింది. అయితే మండే ఎండలో గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వ్యవసాయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ రమేష్బాబు, ఏఓ గణేష్లను నిలదీశారు. కాగా రాస్తారోకోతో హైవేపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు నచ్చజెప్పినా శాంతించలేదు. తమకు ఇ–పాస్ విధానం వద్దని రైతులకు బిల్లుల ద్వారా యూరియా అందించాలని కోరారు. అదే సమయంలో వర్షం రావడంతో రైతులు రాస్తారోకో విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోలెబోయిన కిరణ్, సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బొడ్డు రామలింగయ్య, నున్న యాదగిరి, పోలెబోయిన పెదలింగయ్య, సంపత్ కిరణ్, జహంగీర్, శిగ వెంకన్న, రవీందర్నాయక్, నాగరాజు, సురేష్, యాదగిరి పాల్గొన్నారు.
తప్పని యూరియా తిప్పలు
కోదాడరూరల్ : రైతులకు యూరియా తిప్పలు ఇంకా తప్పడం లేదు. వరి పొలాలు నాట్లు పెట్టి నెల రోజులు దాటుతున్న సమయంలో ప్రస్తుతం పంట యూరియా వేసే అదునుకు చేరుకుంది. దీంతో రైతులు నానాపాట్లు పడుతున్నారు. కోదాడ పీఏసీఎస్ పరిధిలోని గణపవరం ఎరువుల గోదాముకు శనివారం 200 యూరియా బస్తాల లోడ్వచ్చింది. ఆ యూరియా కోసం దాదాపు 300 మంది రైతులు క్యూలో చెప్పులు పెట్టి నిలబడ్డారు. పీఏసీఎస్ సిబ్బంది రైతుల పట్టాదారు పాస్పుస్తకాలు, ఆధార్కార్డులను సీరియల్లో పెట్టారు.5 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారికి రెండు బస్తాలు, అంతకు తక్కువ ఉన్నవారికి బస్తా చొప్పున పోలీసుల పహారాలో రైతులకు పంపిణీ చేశారు. సీరియల్లో ఉండి యూరియా అందని రైతులకు తర్వాత వచ్చేలోడ్లో ముందుగా ఇస్తామని చెప్పి పంపించారు.
ఫ అర్వపల్లి పీఏసీఎస్ ఎదుట రైతుల రాస్తారోకో

వేలిముద్రల విధానం విరమించుకోవాలి