
సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు, ఆర్బీఎస్కే వైద్యాధికారులు, ఉప జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా డెంగీ, చికున్గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, దోమల నివారణకు అన్ని నివాస ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించాలన్నారు. విధుల విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, అధికారులు డాక్టర్ కోటిరత్నం, జయమానూరి, డాక్టర్ నాజియా, డాక్టర్ శ్రీశైలం, వైద్య అధికారులు పాల్గొన్నారు.